లక్ష కోట్ల బంగారం అమ్మేసిందా? ఆర్బీఐ సంచలన ప్రకటన!
దేశ ఖజానాలోని బంగారాన్ని విక్రయించిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని అంతర్జాతీయ నివేదికల్లో వస్తున్న వార్తలపై ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. దేశంలోని బంగారు నిల్వలు తగ్గిపోయాయంటూ వస్తున్న వార్తలను రిజర్వ్ బ్యాంక్ పూర్తిగా కొట్టిపారేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్ని ఉద్రిక్తతలు, విదేశీ మారక నిల్వలపై పడే ప్రభావాన్ని తట్టుకోవడానికి ఆర్బీఐ దాదాపు 12 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.1లక్ష కోట్లు) విలువైన బంగారాన్ని విక్రయించినట్లు కొన్ని నివేదికలు పేర్కొనడంతో మార్కెట్లో గందరగోళం నెలకొంది.
ఈ వివాదంపై బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బంగారం విక్రయానికి సంబంధించిన నివేదికల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్ర బ్యాంక్ వద్ద 880.52 టన్నుల భౌతిక బంగారం నిల్వలు సురక్షితంగా ఉన్నాయని, ఈ పరిమాణంలో ఎలాంటి మార్పు లేదా తగ్గింపు జరగలేదని వివరించింది. ఇలాంటి సున్నితమైన విషయాలలో ప్రజలు కేవలం ఆర్బీఐ అధికారిక వెబ్సైట్, వారు ప్రచురించే పత్రాలను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేసింది.బంగారం విక్రయాలపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా స్పందించింది. పీఐబీ సోషల్ మీడియా వేదికగా ఒక ఫ్యాక్ట్ చెక్ నివేదికను విడుదల చేస్తూ, ఆర్బీఐ భారీ స్థాయిలో బంగారాన్ని విక్రయించిందనే ప్రచారం పూర్తిగా ఫేక్ అని తేల్చిచెప్పింది. ఆర్బీఐ అధికారిక గణాంకాలు ఏవీ కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని ధ్రువీకరించడం లేదని పీఐబీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల నెలల్లో భారత విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా మరింత పెరిగింది. ఆర్బీఐ నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 2025 ముగింపు నాటికి విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా 13.92 శాతంగా ఉండగా.. అది మార్చి 2026 చివరి నాటికి 16.70 శాతానికి పెరిగింది. అలాగే మే 22, 2026 నాటికి ఈ వాటా మరింత వృద్ధి చెంది 16.85 శాతానికి చేరుకుంది. దీనిని బట్టి దేశ ఖజానాలో బంగారం నిల్వలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని స్పష్టమవుతోంది.
ఈ వివాదం ఓ అంతర్జాతీయ నివేదిక అంచనాల వల్లే మొదలైనట్లు తెలుస్తోంది. మే 22తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో ఆర్బీఐ సుమారు 12 బిలియన్ డాలర్ల బంగారాన్ని విక్రయించి ఉండవచ్చని, ఆ డబ్బుతో 7.5 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఆస్తులను కొనుగోలు చేసి ఉంటుందని సదరు నివేదిక అంచనా వేసింది. అయితే ఆర్బీఐ వివరణతో భౌతిక బంగారం నిల్వల్లో ఎలాంటి తరుగుదల లేదని తేలిపోయింది. ప్రస్తుతం మార్కెట్ వర్గాల దృష్టి ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంపై ఉంది. జూన్ 3న ప్రారంభమైన ఈ మూడు రోజుల సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా జూన్ 5న ప్రకటించనున్నారు. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ.. ఆర్బీఐ రెపో రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications