ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల తగ్గింపు!
Recommended Video
ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు ఒక గుడ్న్యూస్ చెప్పింది. మినిమం బ్యాలెన్స్(సగటు నెలవారీ మొత్తాలు) నిర్వహించని సేవింగ్స్ అకౌంట్లపై విధిస్తున్న ఛార్జీలకు భారీగా కోత పెట్టింది.
ఈ ఛార్జీల కోత ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పీకే గుప్తా తెలిపారు. ఈ తగ్గింపుతో దాదాపు 25 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందనున్నట్టు పేర్కొన్నారు.
మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఇలా...
అంతకముందు మెట్రో, అర్బన్ ప్రాంతాలకు నెలవారీ విధిస్తున్న ఛార్జీ 50 రూపాయల(+జీఎస్టీ) నుంచి 15 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటన విడుదల చేసింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల సేవింగ్స్ అకౌంట్లలో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ రూ.3 వేలు.
సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల్లో...
అదేవిధంగా సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల నెలవారీ ఛార్జీలను కూడా 40 రూపాయల(+జీఎస్టీ) నుంచి 10 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గిస్తున్నట్టు తెలిపింది.
తమ కస్టమర్ల సెంటిమెంట్లు, ఫీడ్బ్యాక్ల అనంతరం ఈ మేరకు మినిమం బ్యాలెన్స్ ఛార్జీలకు కోత పెట్టినట్టు ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పీకే గుప్తా తెలిపారు.
వీరికి నో మినిమం బ్యాలెన్స్ చార్జీలు...
కస్టమర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఎస్బీఐ వద్ద 41 కోట్ల సేవింగ్స్ అకౌంట్లు ఉండగా.. పెన్షనర్లు, మైనర్లు, సోషల్ సెక్యురిటీ బెనిఫిట్ హోల్డర్ల పీఎంజేడీవై, బీఎస్బీడీ అకౌంట్లు 16 కోట్లు ఉన్నాయి. 21 కంటే తక్కువ వయసున్న అకౌంట్స్ హోల్డర్స్కు కూడా మినిమమ్ ఛార్జీల నిబంధనలను బ్యాంకు వర్తింపచేయడం లేదు.
బేసిక్ సేవింగ్స్ అకౌంట్కు మారిపోండి...
ఈ మినిమం బ్యాలెన్స్ ఛార్జీల తగ్గింపుతో పాటు ఎలాంటి ఛార్జీలు లేకుండా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ను బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్గా మార్చుకోవడానికి కూడా సదుపాయం కల్పిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీంతో కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి ఉపశమనం పొందుతారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లపై బ్యాంకు ఈ మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను విధించడం లేదు.