50 శాతం కార్ల ఉత్పత్తి బంద్, 50 వేల జాబ్స్ కట్: జర్మన్ కార్ల దిగ్గజం కీలక నిర్ణయం!
ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేసే ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ జర్మన్ కార్ల దిగ్గజం, ప్రపంలోనే రెండో అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ అయిన ఫోక్స్వ్యాగన్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఫోక్స్వ్యాగన్ ఇప్పటివరకు అనుసరిస్తున్న వ్యూహాలకు భిన్నంగా మార్కెట్లో తన ఉనికిని పూర్తిగా మార్చుకోవాలని భావిస్తోంది. ప్రతి విభాగంలోనూ పలు మోడళ్ల ఉండటానికి బదులుగా ఇకపై అధిక డిమాండ్ ఉండి, మెరుగైన వ్యాపారాన్ని అందించగల వాహనాలపై ఫోకస్ పెడతామని ఫోక్స్వ్యాగన్ చెబుతోంది. ఆ సంస్థ తన ప్రపంచవ్యాప్త ఉత్పత్తిని తగ్గించుకోవడానికి సిద్ధమవుతోంది. ఫోక్స్వ్యాగన్ తక్కువ కార్లను ఉత్పత్తి చేయాలని, తక్కువ వేరియంట్లను కలిగి ఉండాలని.. అత్యంత ఆదరణ ఉన్న ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది.
వాస్తవానికి ఫోక్స్వ్యాగన్ రాబోయే సంవత్సరాల కోసం తన అతిపెద్ద వ్యూహాన్ని ప్రకటించింది. 2030 నాటికి తన ప్రపంచవ్యాప్త మోడల్ ఫోర్ట్ ఫోలియోను సుమారు 50 శాతం తగ్గించాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది. దీని అర్థం భవిష్యత్తులో ఆ సంస్థకు చెందిన అనేక కార్లు మార్కెట్ నుంచి కనుమరుగయ్యే అవకాశం ఉంది. వ్యాపారాన్ని సరళంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో చేయాలని తాము కోరుకుంటున్నట్లు ఆ సంస్థ చెబుతోంది. ఇందులో భాగంగా వివిధ బ్రాండ్ల మధ్య సాంకేతికతను ఎక్కువగా పంచుకోవడం, ఉత్పత్తిని తగ్గించడం వంటివి ఉంటాయి.
ప్రతి సెగ్మెంట్లో అనేక మోడళ్లను కలిగి ఉండటానికి బదులుగా, అధిక డిమాండ్ ఉన్న, మెరుగైన వ్యాపారాన్ని అందించగల వాహనాలపై దృష్టి పెడతామని ఫోక్స్వ్యాగన్ చెబుతోంది. అయితే ఏ మోడళ్లను నిలిపివేస్తారనే విషయాన్ని కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. ఈ నిర్ణయం ఫోక్స్వ్యాగన్, స్కోడా, సీట్, పోర్షే, బెంట్లీ, లంబోర్ఘినితో సహా అన్ని బ్రాండ్లను ప్రభావితం చేయవచ్చు. ఫోక్స్వ్యాగన్ గ్రూప్ పదికి పైగా కార్ బ్రాండ్లను కలిగి ఉందని, వాటిని వివిధ దేశాలలో విక్రయిస్తుందని గమనించాలి.

వేరియంట్లు, ఫీచర్లు తగ్గింపు
కంపెనీ మోడల్ నంబర్లను తగ్గించడమే కాకుండా వాహన వేరియంట్లు, ఫీచర్ ఆప్షన్లను కూడా భారీగా తగిస్తుంది. కార్ల వేరియంట్లు, ఫీచర్ ఆప్షన్లను 75 శాతం మేర తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని అర్థంభవిష్యత్తులో కంపెనీ తక్కువ ప్లాట్ఫారమ్లను, తక్కువ ఎలక్ట్రానిక్ సిస్టమ్లను ఉపయోగించనుంది, దీనివల్ల ఒకే సాంకేతికతను వివిధ బ్రాండ్ల వాహనాల్లో ఉపయోగించడానికి వీలవుతుంది. ఇది ఖర్చులను తగ్గించడంలో నేరుగా సహాయపడగలదని కంపెనీ భావిస్తోంది.
వాహన తయారీ పరంగా ఫోక్స్వ్యాగన్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. గత సంవత్సరం టయోటా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11,322,000 వాహనాలను ఉత్పత్తి చేయగా.. ఫోక్స్వ్యాగన్ ఇదే కాలంలో 8,983,000 యూనిట్లను తయారు చేసింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. కొవిడ్-19 మహమ్మారికి ముందు, ఆ సంస్థకు సంవత్సరానికి సుమారు 12 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సామర్థ్యం ఇప్పటికే తగ్గించబడింది. ఇప్పుడు యూరప్, చైనా వంటి ప్రధాన మార్కెట్లలో దీనిని మరింత తగ్గించడానికి సిద్ధమవుతోంది.
ఈ కీలక నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే?
ఆటో పరిశ్రమ వేగంగా మారుతోందని జర్మన్ కార్ల తయారీ సంస్థ చెబుతోంది. చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ, కొత్త ప్రభుత్వ నిబంధనలు, పెరుగుతున్న పరిశోధన, అభివృద్ధి ఖర్చులు, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వినియోగదారుల డిమాండ్లు వ్యాపారంపై ఒత్తిడిని పెంచాయి. అంతేకాకుండా, 2021తో పోలిస్తే కంపెనీ లాభాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా ఖర్చుల తగ్గింపు ఫోక్స్వ్యాగన్కు ప్రధాన ప్రాధాన్యతగా మారింది. ఈ కొత్త వ్యూహం భవిష్యత్తులో కంపెనీని మరింత చురుగ్గా, పోటీతత్వంతో, బలంగా మారుస్తుందని సీఈఓ ఆలివర్ బ్లూమ్ అంటున్నారు.
మీడియా నివేదికల ప్రకారం, కంపెనీకి సంబంధించి ఈ ప్రధాన పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని ఫ్యాక్టరీలను మూసివేయడం, ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం జరగవచ్చు. ఫోక్స్వ్యాగన్ ఈ ప్రణాళికలను ఇంకా అధికారికంగా ధ్రువీకరించకపోవడం గమనార్హం. అయితే, రాయిటర్స్ నివేదిక ప్రకారం, పెరుగుతున్న పోటీని తట్టుకుని నిలబడటానికి కంపెనీ సుమారుగా 50,000 అదనపు ఉద్యోగాలను తగ్గించాల్సి రావచ్చని సీఈఓ ఆలివర్ బ్లూమ్ ఉద్యోగులకు పంపిన ఓ అంతర్గత సందేశంలో పేర్కొన్నారు. ఒకవేళ ఇది జరిగితే ఫోక్స్వ్యాగన్ గ్రూప్లోని సుమారు లక్ష మంది ఉద్యోగుల ఉద్యోగాలు ప్రభావితం కావచ్చు. రాబోయే ఐదేళ్లలో కంపెనీ తన ప్రపంచవ్యాప్త మోడల్ శ్రేణిని సగానికి తగ్గించబోతోందనేది మాత్రం ఖాయం. ఫోక్స్వ్యాగన్ గ్రూప్ చరిత్రలో ఇది అతిపెద్ద ఉత్పత్తి మార్పులలో ఒకటిగా పరిగణించబడుతోంది. భవిష్యత్తులో దాని అన్ని బ్రాండ్లలోని కొత్త వాహనాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications