రజినీకాంత్ను బీజేపీ ఇబ్బంది పెడుతోందా?: కోర్టుకెక్కిన తలైవా: వేడెక్కిన తమిళ రాజకీయాలు
చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి తమిళనాడు సిద్ధపడుతోంది. మరో ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీ తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారంలో ఉన్న అన్నా డీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల మధ్యే ప్రధానంగా పోటీ ఏర్పడటం ఖాయంగా కనిపించినప్పటికీ.. ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. దీనికి కారణం- దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉండటమే. ఇప్పటికే బహుభాషా నటుడు కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తున్నారు.

అధికార యంత్రాంగం ప్రయోగం..
ఇక రజనీకాంత్ కూడా ఎన్నికల బరిలోకి దిగితే.. ఫలితాలు తారుమారవుతాయనే అంచనాలు ఉన్నాయి. అందుకోసమే రజినీకాంత్ను అధికార అన్నా డీఎంకే వ్యూహాత్మకంగా ఇబ్బందులకు గురి చేస్తోందా? కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్న ఏఐఏడీఎంకే.. రజినీకాంత్ తమకు మద్దతు ఇవ్వకపోతే.. మున్ముందు మరిన్ని సమస్యలు తప్పవనే సంకేతాలను పంపిస్తోందా? దీనికోసం తమిళనాడు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ప్రయోగిస్తోందా? అంటే అవుననే అనుకోవాల్సి వస్తోంది.

కల్యాణ మండపానికి భారీగా ఆస్తిపన్ను..
రజినీకాంత్కు చెందిన శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపం ఆస్తి పన్ను వ్యవహారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆరున్నర లక్షల రూపాయల ఆస్తిపన్నును చెల్లించాలంటూ గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రజినీకాంత్కు నోటీసులను పంపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ రజినీకాంత్ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుంచీ తాను ఈ కల్యాణ మండపంలో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదని, అయినప్పటికీ.. పన్ను చెల్లించాలంటూ గ్రేటర్ చెన్నై అధికారులు నోటీసులు పంపించారని రజినీకాంత్ తన పిటీషన్లో పేర్కొన్నారు.

ఆదాయం లేక.. ఖాళీగా..
ఈ ఏడునెలల కాలంలో కల్యాణ మండపం ద్వారా తనకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదని చెప్పారు. అయినప్పటికీ.. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలానికి సంబంధించి ఆరున్నర లక్షల రూపాయల మేర ఆస్తిపన్నును చెల్లించాల్సి ఉంటుందంటూ అధికారులు తనకు నోటీసులు పంపించారని, ఏ రకంగానూ తాను ఇంత మొత్తాన్ని కట్టాల్సిన అవసరం లేదని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాను గ్రేటర్ చెన్నై అధికారులకు లేఖ రాశానని, వారి నుంచి తనకు ఎలాంటి బదులు రాలేదని అన్నారు.

చెన్నై మున్సిపల్ యాక్ట్ ఏం చెబుతోంది?
చెన్నై మున్సిపల్ యాక్ట్-1919 ప్రకారం..ఇది విరుద్ధమని అన్నారు. ఏడాదిలో సగం రోజుల పాటు ఏదైనా బిల్డింగ్ వరుసగా 30 రోజులు లేదా అంతకు మించిన కాలం పాటు ఖాళీగా ఉండాల్సి వస్తే.. చెన్నై మున్సిపల్ యాక్ట్-1919 ప్రకారం ఆస్తిపన్నును చెల్లించనక్కర్లేదని, ఖాళీగా ఉన్న కాలంలో ఆక్యుపెన్సీ నమోదైన శాతం వరకే పన్నును చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని చెన్నై మున్సిపల్ యాక్ట్-1919లో పొందుపరిచిన సెక్షన్ 105 (1) సూచిస్తోందని రజినీకాంత్.. తన పిటీషన్లో పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా అధికారులు ఆస్తిపన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపించారని అన్నారు. ఈ పిటీషన్ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
Recommended Video

బీజేపీకి సానుభూతిపరుడిగా..
నిజానికి- రజినీకాంత్ బీజేపీకి సానుభూతిపరుడిగా ఉంటోన్న విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బహిరంగంగా ప్రశంసించారు. అలాగనీ- ఏనాడూ ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని వెనకేసుకుని రాలేదు. జాతీయ స్థాయిలో బీజేపీ చేపట్టిన చర్యలపై పొగడ్తలు కురిపిస్తున్నారే గానీ.. ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి సానుకూలంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆయన ప్రభావం ఉంటుందని అన్నా డీఎంకే భావిస్తోంది. అందుకే- ఆయనపై ఒత్తిళ్లను తీసుకొస్తోందనే అభిప్రాయాలు తమిళ రాజకీయాల్లో వ్యక్తమౌతున్నాయి.
ఇదిలా ఉంటే పదిరోజుల క్రితమే చెన్నై కార్పొరేషన్ నోటీసులు ఇవ్వగా ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమేంటని రజినీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాగైతే జరిమానా విధిస్తామంటూ న్యాయమూర్తి అనితా సుమంత్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇది కోర్టువారి విలువైన సమయాన్ని వృథా చేసినట్లే అని కీలక వ్యాఖ్యలు చేయడంతో రజినీ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications