పోలింగ్ రోజు.. మంత్రి పెద్దిరెడ్డిని కార్నర్ చేసిన టీడీపీ
Peddireddy Ramachandra Reddy: ఏపీలో పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.

ఈ పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ సంచలనాలకు తెర తీసింది. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలను గుప్పించింది. పోలింగ్ రోజున ఆయనను కార్నర్ చేసేలా అనూహ్య వ్యూహాలను పన్నింది. మంత్రి పెద్దిరెడ్డిపై ఏకంగా కిడ్నాప్ విమర్శలను సంధించింది.
తమ పార్టీకి చెందిన 15 మంది పోలింగ్ ఏజెంట్లను పెద్దిరెడ్డి అనుచరులు, ఆయన వర్గీయులు కిడ్నాప్ చేసినట్లు ఆరోపించింది టీడీపీ. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సదుం మండలం బొరగమంద గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలియజేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 15 మంది తమ పార్టీ ఏజెంట్లను పెద్దిరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది.
దీనిపై కొద్దిసేపటి కిందటే కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి బొరగమంద గ్రామానికి బయలుదేరిన 15 మంది తమ పార్టీ ఏజెంట్లను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారని, వారిని కొట్టి, వాహనంలో తీసుకెళ్లారని ఈసీకి వివరించింది.
ఈ ఘటనపై తక్షణ చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సజావుగా, శాంతియుత వాతావరణంలో సాగేలా ఏర్పాట్లు చేయాలని కోరింది. తమ పార్టీ ఏజెంట్లను విడిపించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించింది.












Click it and Unblock the Notifications