నగరిలో అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా: చంద్రబాబుపై విమర్శలు
చిత్తూరు: నగరిలో కొత్తగా వచ్చిన 108, 104 వాహనాలను ఎమ్మెల్యే రోజా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె 108 వాహనం డ్రైవింగ్ సీట్లో కూర్చుకున్నారు. సరదాగా కాసేపు డ్రైవింగ్ చేశారు. దీంతో ఆమె అభిమానులు, స్థానికులు కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. ప్రతి రాష్ట్రంలోని ప్రజలు తమకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.

చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీ నేతలు తిన్నది అరక్క విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. 203 కోట్లతో అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేస్తే వందల కోట్లలో అవినీతి జరిగిందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ తీసుకొచ్చిన అంబులెన్స్లను కూడా చంద్రబాబు సరిగా నడపలేదని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని దుయ్యబట్టారు.
ఇటీవలే వెయ్యికిపైగా 108, 104 వాహనాలను ఏపీ సర్కారు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత విజయవాడ నుంచి రాష్ట్ర నలుమూలాలకు ఆ వాహనాలు తరలివెళ్లాయి. ఈ వాహనాల్లో 676 వాహనాలు 104వి కాగా, మరో 412 వాహనాలు 108 అంబులెన్స్లు.
ప్రభుత్వం కొత్తగా అత్యాధునిక వైద్య సేవలందించే ఈ అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు(బీఎల్ఎస్)కు సంబంధించినవి.. 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు
(ఏఎల్ఎస్)తో తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్స్లను చిన్నారులకు వైద్య సేవలందించేలా తయారు చేశారు.












Click it and Unblock the Notifications