వారసుడిని కనాల్సిందే... నాతో ఉండు... కోడలికి మామ లైంగిక వేధింపులు...
ఆమెది ప్రేమ వివాహం. ఇద్దరు పిల్లల తల్లి. అయితే కొడుకును కనలేదన్న కారణంతో భర్త తరుచూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మామయ్యతో చెప్తే కాస్త మందలిస్తాడని భావించింది. కానీ మామ అసలు స్వరూపం తెలిసి షాక్ తిన్నది. కొడుక్కి బుద్ది చెప్పాల్సిందిపోయి మామ కూడా కోడలిని వేధించడం మొదలుపెట్టాడు. చివరకు అత్తతో చెప్పినా లాభం లేకపోయింది. దీంతో స్పందన కార్యక్రమంలో పోలీసులకు ఆమె తన సమస్యను విన్నవించుకోవడంతో ఈ సంఘటన వెలుగుచూసింది.

2016లో ప్రేమ వివాహం...
గుంటూరు పట్టణానికి చెందిన ఓ యువతి కొన్నేళ్ల క్రితం ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండేది. అదే షాపులో పనిచేసే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఇరువురి పెద్దల అంగీకారంతో 2016లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారసుడిని కనలేదంటూ చీటికి మాటికి ఆమెతో గొడవపడటం మొదలుపెట్టాడు.

కోడలితో మామ అసభ్యకర రీతిలో...
భర్త ప్రవర్తనపై మామకు చెప్తే మందలిస్తాడని భావించింది. దీంతో ఆయనకు విషయం చెప్పగా... కొడుక్కి బుద్ది చెప్పకపోగా.. వావి వరసలు మరిచి కోడలితో అసభ్యకరంగా మాట్లాడాడు. మా కుటుంబానికి వారసుడు కావాలి... నువ్వు నాతో ఉండు అని చెప్పాడు. నేను మీ కూతురి లాంటిదాన్ని అని ఆమె ప్రాధేయపడినా అలాంటి పట్టింపులేమీ లేవన్నాడు. అప్పటిదాకా భర్త వేధింపులే అనుకుంటే... ఇక అప్పటినుంచి మామ వేధింపులు కూడా మొదలయ్యాయి.

పుట్టింటికి వెళ్లినా విడిచిపెట్టలేదు..
మామ వేధింపులు తాళలేక పిల్లలను తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పిల్లలను చూడాలన్న సాకుతో ఆమె మామ అక్కడికి కూడా వెళ్లేవాడు.ఓరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై బలత్కారం చేయబోయాడు. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని ఆమె ఇంటి బయటకు పరిగెత్తింది. తల్లిదండ్రులతో ఆ విషయం చెప్పడానికి మనసొప్పక భర్తతోనే చెప్పుకుంది. కానీ అవన్నీ మామూలే అంటూ అతను కూడా లైట్ తీసుకోవడంతో ఆమె షాక్ తిన్నది.

అత్తకు చెప్పి చూసినా...
కొద్దిరోజుల తర్వాత అత్తకు చెప్పి చూసినా భర్త లాగే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఈరోజుల్లో అవన్నీ మామూలే కదా అని తీసిపారేసింది. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక... ఎవరు న్యాయం చేస్తారో తెలియక ఆమె సతమతమవుతోంది. ఈ క్రమంలోనే గుంటూరులో సోమవారం(సెప్టెంబర్ 28) స్పందన కార్యక్రమం నిర్వహించడంతో బాధితురాలు అక్కడికి వచ్చి పోలీసులకు వివరాలు వెల్లడించింది. దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ గంగాధరం స్థానిక పోలీసులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications