రాజధానిగా నో అంటూనే విశాఖపై జగన్ విషం కక్కారు.. లోకేష్ కామెంట్.. షాక్లో ఉత్తరాంధ్ర వాసులు
ఏపీలో టీడీపీ నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజధానిగా విశాఖ నో అంటూనే సీఎం జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి అని నిప్పులు చెరిగారు . ఒక పక్క జీఎన్ రావు కమిటీ నివేదిక చిత్తు కాగితం అంటూనే ఇప్పుడు జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ద్వారా విషం కక్కారని ఆరోపిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రకు తుఫానుల ముప్పు, భద్రతా సమస్యలు ఉన్నాయని రిపోర్ట్ లో రాయించి ఉత్తరాంధ్ర భవిష్యత్ నాశనం చేసిన ద్రోహి జగన్ అని ఆయన ఆరోపణలు గుప్పించారు. నారా లోకేష్ కొత్త వెర్షన్ వింటున్న ఉత్తరాంధ్ర వాసులు షాక్ కు గురవుతున్నారు.
Recommended Video

జగన్ ను ఉత్తరాంధ్ర ద్రోహి అన్న లోకేష్
ఒకపక్క విశాఖ రాజధానిగా వద్దంటూ మరోపక్క విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెయ్యాలని చూస్తున్న జగన్ ను ఉత్తరాంధ్ర ద్రోహి అని లోకేష్ ఎలా అంటారు అని ఆలోచనలో పడ్డారు. ఇంతకీ లోకేష్ ఏం చెప్పారంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ జీఎన్ రావు కమిటీ నివేదికను ఉద్దేశించి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. విశాఖను, ఉత్తరాంధ్రను దెబ్బతీసింది జగనేనని, గతంలో తన తల్లిని ఎన్నికల్లో ఓడించారన్న ద్వేషంతో ఉత్తరాంధ్ర నడ్డివిరిచేలా జీఎన్ రావు కమిటీతో విషం కక్కారని ఆయన మండిపడ్డారు.

జీఎన్ రావు కమిటీ చెత్త రిపోర్ట్ తో ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టరని ఆరోపణ
తుపానులు వస్తాయని, ఉప్పునీరు చొచ్చుకుని వస్తుందని, భద్రత ఉండదని కుట్రపూరితంగా రిపోర్ట్ రాయించారని ఆరోపించారు. ఇప్పుడీ చెత్త రిపోర్ట్ తో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాకుండా చేశారని ఉత్తరాంధ్ర అభివృద్దిని జగన్ అడ్డుకున్నారని లోకేశ్ ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్రకు కంపెనీలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు రాకుండా చేసి జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ తో దారుణంగా దెబ్బతీశారని జగన్ పై విరుచుకుపడ్డారు.

భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా వీరంగం, ఇన్సైడర్ ట్రేడింగ్ ఉత్తరాంధ్ర నాశనానికే
ఉత్తరాంధ్రపై జగన్ దండయాత్ర ప్రారంభమైంది. అభివృద్ధి ప్రణాళిక లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి అని జగన్ అన్నప్పుడే అనుమానం వచ్చిందని చెప్పారు నారా లోకేష్. కార్యాలయాలు అటు, ఇటు మార్చడం ద్వారా ఉత్తరాంధ్ర వెలిగిపోతోందని అన్నప్పుడు నా అనుమానం మరింత బలపడిందని పేర్కొన్నారు . విశాఖలో జరుగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా వీరంగం, ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు చూస్తుంటే క్లారిటీ వచ్చిందని ఆరోపణలు గుప్పించారు.

విశాఖరాజధానిగా నో అని వైజాగ్ రాజధాని అన్న జగన్ పై విమర్శలు చెయ్యటంపై షాక్
కానీ లోకేష్ చెప్పిన దానిలో లాజిక్ లేదని ఒకవైపు విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తే విశాఖ అభివృద్ధి చెంది తీరుతుందని ఉత్తరాంధ్ర వాసులు అంటున్నారు. ఇక విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ ఇప్పుడు సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ద్రోహం చేశారు అనటం విచిత్రంగా వుందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం జోరందుకున్నాయి. సచివాలయమే విశాఖకు వస్తుంటే ఉత్తరాంధ్రకు ఉద్యోగాలు రాకుండా ఎలా ఉంటాయని లోకేష్ ను ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications