కరోనా బారినపడిన మరో ఎమ్మెల్యే: హోంక్వారంటైన్లో గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
గుంటూరు: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తూనే ఉంది. సామాన్యులే కాక, ఈ మహ్మారి బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కరోనావైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
ఒళ్లు నొప్పులు, తలనొప్పి రావడంతో కోవిడ్ టెస్టులు చేయించగా పాజిటివ్గా నిర్దారణ అయ్యిందని తెలిపారు. ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నాని, నెగిటివ్ వచ్చే వరకూ తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, త్వరలోనే ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంతేగాక, గత నాలుగైదు రోజుల నుంచి తనను కలిసినవారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఏపీలో ఇప్పటి వరకు 3,45,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 89,389 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,52,638 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 3,189 మంది మరణించారు.
దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఇక యాక్టివ్ కేసుల్లో మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 1,69,516 యాక్టివ్ కేసులుండగా, ఏపీలో 89,389 యాక్టివ్ కేసులున్నాయి.
Recommended Video