టీడీపీ యాత్రతో వైసీపీలో వణుకు పడుతుంది : లోకేష్
మాజీ మంత్రి నారా లోకేష్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . టీడీపీ ప్రజా చైతన్య యాత్ర అంటే వైసీపీ నేతలకు భయం పట్టుకుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రజా చైతన్య యాత్రపై 17 మంది మంత్రులు ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు చెయ్యటం అందుకు నిదర్శనం అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎవరెన్ని చేసినా జగన్ 30 ఏళ్లు సీఎంగా ఉంటారని అంటున్నారని, ఇక అలాంటప్పుడు మేం ప్రజా చైతన్య యాత్ర చేస్తే వైసీపీకి భయమెందుకు? అని నారా లోకేష్ ప్రశ్నించారు.

తొమ్మిది నెలల పాలనపై ప్రెస్ మీట్ పెట్టలేని సీఎం
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలైందని, ఒక్క ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టే ధైర్యం కూడా ఈ తుగ్లక్ ముఖ్యమంత్రికి లేదని నారా లోకేష్ విమర్శించారు. నీ కేసులు సంగతేంటి.. కేంద్రం నిధుల సంగతేంటి? హోదా ఏమైంది అంటూ లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. రేషన్కార్డులు, పెన్షన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఇక ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుందని జగన్ భయపడుతున్నారు. అందుకే టీడీపీపై బురద చల్లుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు .

మా ఆస్తులు ఇవే.. ఎక్కువుంటే నిరూపించాలని సవాల్
ఇక ఈ నేపధ్యంలోనే ఆయన సీఎం జగన్ , దొంగ లెక్కలు రాసి ఏ-2 అయిన విజయసాయిరెడ్డిలపై నిప్పులు చెరిగారు. ఆస్తుల ప్రకటనపై ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువుంటే నిరూపించండి.. మీకు రాసిస్తా. మా సవాల్కు తుగ్లక్ సీఎం సిద్ధమేనా? అని నారా లోకేష్ అడిగారు. జగన్ అధికారంలోకి వచ్చాక మూడే మూడు పనులు చేశారన్న ఆయన చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర అంటే భయపడుతున్నారని మండిపడ్డారు .

చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ నిప్పులు
రంగులు మార్చటం ,దాడులు చెయ్యటం , హామీలపై వెనక్కు తగ్గటం ఈ మూడే చేస్తున్నారని లోకేష్ విరుచుకుపడ్డారు. జగన్ పీపీఏలు రద్దు చేసినప్పుడే ఏపీ బ్రాండ్ వ్యాల్యూ పడిపోయిందని ఆరోపించారు. 9 నెలల్లో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు భద్రత విషయంలో కూడా నారా లోకేష్ నిప్పులు చెరిగారు.

చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర అంటే భయం అందుకే
చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగిందని తెలిసి , ఇటీవల ఒక ఎమ్మెల్యేను మావోలు హతమార్చారని తెలిసి కూడా భద్రత తగ్గించాలనే ఆలోచన వెనుక కుట్ర వుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా జరిగిన ఐటీ దాడులతో తమకు ఏం సంబంధం ఉందని స్పందించాలని ప్రశ్నించిన నారా లోకేష్ వైసీపీ ఇప్పుడు ప్రజా చైతన్య యాత్రలలో చంద్రబాబు నిజాలు జనాలకు చెప్తారని భయపడుతున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications