GOOD NEWS:40 వేల ఉద్యోగాల భర్తీ, సీఎం కేసీఆర్ ప్రకటన
ఉద్యోగ ప్రకటన కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు చూస్తున్నారు. వారికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ తెలియజేశారు. రాష్ట్రంలో త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. దీనికి సంబంధించి రేపో మాపో నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. కొత్త జోనల్ విధానం తీసుకొచ్చామని, రాష్ట్ర యువత హక్కులు సాధించామని, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కేసీఆర్ అన్నారు. మల్టీ జోనల్ పోస్టింగ్ విధానం తీసుకొచ్చామన్న కేసీఆర్.. దీని ద్వారా నాన్ లోకల్ వారు 5 శాతం మాత్రమే వస్తారని చెప్పారు.
Recommended Video
ఎందుకు రాద్దాంతం..
పరిపాలన అంటే ఏంటో తెలియని వారంతా ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. 317 జీవోను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. 317 జీవోపై అవనసరంగా రాద్దాంతం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. కొంతమంది స్వార్థపరులైన ఉద్యోగులు మేం ఇక్కడే ఉంటామని అంటున్నారు.. 317 జీవో వద్దనే వారి లాగు పగులకొట్టాలన్నారు. 317 జీవోతో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వస్తాయని క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో త్వరలో 40 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. తెలంగాణలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. మల్టీజోనల్ విధానం వల్ల 2-3 శాతమే స్థానికేతరులకు వస్తాయి. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనే మల్టీ జోన్ విధానం తెచ్చాం. 317 జీవో వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కేసీఆర్ అన్నారు.
నాశనం చేస్తోంది..
దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రానికి మెదడు లేదని, గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ.. దేశ వినాశనానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. కావేరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని బడ్జెట్లో తెలిపారు. ఇది ఎలా సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నదులు అనుసంధానం చేస్తామనడం ఓ పెద్ద జోక్ అన్నారు. గోదావరి జలాల్లో ప్రతి బొట్టుపై తెలుగు రాష్ట్రాలకే అధికారం ఉంది. మాకు హక్కు ఉన్న జలాలను కావేరీలో ఎలా కలుపుతారు. అభిప్రాయాలు తీసుకోకుండా బడ్జెట్లో ఎలా ప్రకటిస్తారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ప్రజలకు సాగునీరు అందిస్తున్నాం. దేశంలో 65 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. కానీ, 35 వేల టీఎంసీల నీళ్లు మాత్రమే వినియోగంలోకి తెచ్చారు.
నీటి కోసం యుద్దాలు
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే భారత్లో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. కేంద్ర జల విధానాల వల్ల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. జల్శక్తి మిషన్కు రూ.60వేల కోట్లని గొప్పలు చెబుతున్నారు. 140 కోట్ల దేశ జనాభాకు రూ.60వేల కోట్లా? తెలంగాణలో మిషన్ భగీరథకు రూ.40 వేల కోట్లు కేటాయించాం. జల్శక్తి మిషన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.