ఆదాయం ఉంటే చాలా? ప్రజల ఇబ్బందులు పట్టవా?: కేసీఆర్పై అశ్వత్థామ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మరోసారి తెలంగాణ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య దేశంలో కార్మిక సంఘాలు ఉండాలని, ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యానగర్లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

లేదంటే న్యాయ పోరాటం
యూనియన్లకు సంబంధించి రహస్య ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎక్కువ మంది అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యానించారు. సంక్షేమ మండలిలో సభ్యులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో చెప్పాలని అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు.

ఒక్క కార్మికుడూ సంతృప్తిగా లేడు..
ఇక మహిళా కండక్టర్లకు ఏకపక్షంగా ఉదయం షిప్టు వేస్తున్నారని, దీంతో ఒక్క కార్మికుడు కూడా సంతృప్తిగా పని చేయడం లేదని అశ్వత్థామ రెడ్డి అన్నారు. చట్ట వ్యతిరేకంగా కేటాయించే డ్యూటీలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీలను ఎత్తివేయకుంటే కార్మిక సంఘాలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..
సమ్మె కాలంలో కొంత మంది అధికారులు అవినీతికి పాల్పడ్డారన్నారు. పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు వద్దని, కోరుకున్న వాళ్లకు మాత్రమే అలా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రయాణికుల ఇబ్బందులు ఆలోచించరా?
బెంగళూరులో 7వేల బస్సులున్నాయని, ఇక్కడేమో 3,500 బస్సుల్లో వెయ్యి బస్సులను కుదిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సర్కారు ఆదాయం వస్తుందని ఆలోచిస్తోంది కానీ.. ప్రజలు, ప్రయాణికులు పడే ఇబ్బందులు గురించి ఆలోచించడం లేదని అశ్వత్థామ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications