బస్తీ మే సవాల్: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణం చేద్దామా, వరద సాయం లేఖపై బండి గరం గరం..
గ్రేటర్లో వరద సాయం చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వరదసాయం నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే వరదసాయాన్ని నిలిపివేసింది బీజేపీయేనని సీఎం కేసీఆర్ ఆరోపించారు. దీనికి బలం చేకూర్చేలా బండి సంజయ్ పేరుతో ఓ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో రూ.10 వేల సాయం నిలిపివేయాలని ఉంది. అయితే దీనిపై బండి సంజయ్ స్పందించారు. ఆ లేఖ తాను రాయలేదని.. కొందరు ఫోర్జరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ పేరుతో లేఖ
హైదరాబాద్లో వరదసాయం నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బండి సంజయ్ పేరుతో లేఖ రాసినట్టు ఉంది. అందులో ఆయన సంతకం కూడా ఉంది. అయితే దీనిపై బండి సంజయ్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టంచేశారు. వరద సాయం ఆపాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయలేదన్నారు. తన పేరుతో కొందరు రాసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు..?
ఎన్నికలను నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే కేంద్ర ఎన్నికల కమిషన్కు ఎందుకు లెటర్ రాస్తానని ప్రశ్నించారు. దీనిని బట్టి ఎవరో కావాలనే కుట్ర చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు తన సంతకాన్ని పోర్జరీ చేసి ఉంటారని అన్నారు. ఫేక్ లెటర్ సృష్టించి మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు. వరద సాయంపై సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నాని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణం..
వరద సాయం ఆపింది బీజేపీ అని నిరూపించగలరా అని ప్రశ్నించారు. దీనిపై భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. వరద సాయం ఆపిన వాళ్లు మూర్ఖులు అని బండి సంజయ్ అన్నారు. దొంగపాస్ పోర్టు బ్రోకర్లకు సీఎం పదవి ఇస్తే ఇలానే ఉంటుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్పై క్రిమినల్ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కామెంట్లకు బండి సంజయ్ ధీటుగానే కౌంటర్ ఇచ్చారు.