ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, వీరేం చేస్తారు..: విప్ వెనుక అసలు ఉద్దేశ్యం ఇదేనా?
హైదరాబాద్: రేపు (మంగళవారం) జరగబోయే) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేసింది. రెండు రకాల వ్యూహాలతో విపక్షం ఈ ప్లాన్కు తెరలేపిందని భావిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 88 సీట్లు గెలుచుకోగా, ఇద్దరు స్వతంత్రులు ఆ పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 90కి చేరుకుంది. కాంగ్రెస్ నుంచి 19, టీడీపీ నుంచి ఇధ్దరు గెలిచారు. ఈ లెక్కలతో తెరాస -మజ్లిస్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుస్తుంది. కానీ ఇప్పటికే ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. దీంతో ఆ పార్టీ బలం పెరిగి, కాంగ్రెస్ బలం తగ్గింది.
ఈ నేపథ్యంలో తెరాస కొత్త పోకడలకు వెళ్తుందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది. అయితే రెండు వ్యూహాలతో ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు కూడా ఓటింగ్లో పాల్గొనవద్దని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
ఈ విప్ ద్వారా.. తెరాసకు మద్దతు పలికే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రజల ముందుకు తీసుకు రావొచ్చుననేది ఓ వ్యూహం కాగా, రెండోది.. విప్ కారణంగా తెరాసకు మద్దతు పలికే తమ ఎమ్మెల్యేలు వచ్చి ఓటు వేయకుంటే తెరాస అభ్యర్థులు గెలిచినప్పటికీ.. తెరాసకు బలం లేదని నిరూపించవచ్చునని భావిస్తున్నారు.
నెల రోజుల్లో ఐదుగురు ఔట్: దేనికైనా రెడీ.. హరిప్రియ, సబిత నో... జానా సహా అందరూ ఆశ్చర్యం
ఈ రెండు వ్యూహాలతో కాంగ్రెస్ విప్ జారీ చేసిందని అంటున్నారు. విప్ జారీ చేయకుంటే కనుక.. ఎవరు ఎవరికి ఓటు వేశారో తెలియదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారు. అలా అయితే 19 ఓట్లు పడాలి. కానీ తెరాసకు మద్దతిచ్చే వారు తెరాస అభ్యర్థికి ఓటు వేయడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు తగ్గుతాయి.
కానీ తమకు ఎవరు ఓటు వేయలేదనే విషయం తెలుసుకోవడం సుదీర్ఘ ప్రక్రియ. కోర్టుకు వెళ్లడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. దానికి కూడా సమయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు బహిష్కరించినందున.. తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడం ద్వారా ఓటు వేయకుండా చేస్తే.. తెరాసకు మద్దతిచ్చే వారిని నైతికంగా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టువచ్చునని భావిస్తున్నారు. లేదంటే తెరాస గెలిచినప్పటికీ పూర్తి ఓట్లు రావు. అది కూడా తెరాసకు నైతికంగా దెబ్బే అంటున్నారు. మొత్తానికి తెరాసలో చేరిన లేదా మద్దతిస్తున్న ఆత్రం సక్కు, హరిప్రియ, చిరుమర్తి లింగయ్య, రేగా కాంతారావులకు చిక్కే. సబితా ఇంద్రా రెడ్డి కూడా తెరాసలో చేరాలనుకుంటున్నారు. ఆమె కూడా తెరాస అభ్యర్థికే ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ విప్ నేపథ్యంలో వారు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.