హవ్వా.. కేసీఆర్, గవర్నర్పై ఇంత కక్షనా.. రాములమ్మ ఫైర్
సీఎం కేసీఆర్పై రాములమ్మ విజయశాంతి విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. మహిళలను అవమానించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆమె ఆరోపించారు. ఈసారి శాడిస్ట్ మనస్తత్వానికి ఏకంగా గవర్నర్ తమిళిసైని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పలు ఆరోపణలు చేస్తూ వాటిని సోషల్ మీడియా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పటి బడ్జెట్ సమావేశాల అంశం మాత్రమే కాదన్నారు. గత నెలలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవం రోజున కూడా సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు రాజ్భవన్ కార్యక్రమానికి హాజరు కాకుండా గవర్నర్ను అవమానించారని పేర్కొన్నారు.
ప్రోటోకాల్ ఉల్లంఘన
మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆడబిడ్డ దేవతల జాతరలో కూడా మహిళా గవర్నర్ అయిన తమిళిసైరె ప్రోటోకాల్ ఉల్లంఘనతో అవమానించారు. గవర్నర్కు స్వాగతం పలికేందుకు, వీడ్కోలు చెప్పేందుకు ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ రాలేదు. మేడారంలో గవర్నర్ ఉన్నంత సేపు మంత్రులు, అధికారులు కనిపించలేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంత అభివృద్దిపై గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అయినా కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ పట్టించుకోలేదు. గవర్నర్ పర్యటన రోజున... ఆ ఉదయం వరకూ మంత్రులు అక్కడే ఉన్నారు. కానీ, తమిళిసై వచ్చే సమయానికే ఎలా మాయమయ్యారు?... వీరంతా గవర్నర్ పట్ల ఇలా ప్రవర్తించేలా ఎవరు పురికొల్పారో అందరికీ తెలుసు. ఈ చర్యలు యావత్ మహిళా లోకాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదు. తమిళ ఆడపడుచు అయిన ఈ మహిళామూర్తిని ఘోరంగా అవమానిస్తున్న కేసీఆర్... ఏ ముఖంతో తమిళనాడు సీఎంతో ఫ్రంట్ పేరు చెప్పి మీటింగులు చేస్తున్నరు? తమిళ ప్రజలేమీ అమాయకులు కారని గుర్తుచేశారు.
ఇప్పుడే కాదు
మహిళల పట్ల తొలి నుంచీ కేసీఆర్ వివక్షతో వ్యవహరిస్తూ వస్తున్నారని ఫైరయ్యారు. టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కేబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 6 నెలల వరకు కేబినెట్ను విస్తరించలేదు. విమర్శల నేపథ్యంలో మాత్రమే ఇద్దరు మహిళలకి మంత్రి పదవులిచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలను కుక్కలు అని దూషించిన కేసీఆర్ వ్యాఖ్యలను మహిళాలోకం మర్చిపోలేదు. మహిళల పట్ల ఈ విధంగా వ్యవహరించే కేసీఆర్... చట్ట సభల నిర్వహణలో రూల్స్ పాటిస్తారనుకోవడం పొరపాటు.
9వ అసెంబ్లీ సెషన్ ఎలా
గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 9వ అసెంబ్లీ సెషన్ ప్రారంభిస్తున్నారు. పైగా అసెంబ్లీ ప్రొరోగ్ కానందున ఈ సెషన్ను ఇంతకుముందు జరిగిన సెషన్కు కొనసాగింపుగానే పరిగణిస్తామనడం మూర్ఖత్వం కాదా? ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతే, బడ్జెట్ సెషన్ ప్రారంభం కావాలి. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోంది. కేసీఆర్ రూల్స్ ఏవీ పాటించడం లేదు. నేనే ఒక రాజు, తెలంగాణ ఒక రాజ్యం" అన్నట్లుగా కేసీఆర్ ఫీల్ అవుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవీలో ఉన్న గవర్నర్నే గుర్తించనని కేసీఆర్కు సీఎం సీటులో ఒక్క నిమిషం కూడా కూర్చునే అర్హత లేదన్నారు.