1000 కోట్ల మోసం చేసిన ఈ బిజ్ ... ఓ మాయదారి కుటుంబం దోపిడీ చూస్తే షాక్ అవుతారు
ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే ముఠాలు ఇప్పుడు భారత దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కానీ పేద వారుగానే చనిపోవడం తప్పు, డబ్బు సంపాదించాలనే తపన లేకపోవడం తప్పు అంటూ జనాలను రెచ్చగొట్టిన భార్య, భర్త, కుమారుడు కలిసి జనానికి రూ.1000 కోట్లు కుచ్చు టోపీ పెట్టారంటే ఎంతగా మన దేశంలో ఆర్ధిక నేరగాళ్ళు పెరిగిపోయారో అర్ధం చేసుకోవచ్చు.

ఒక కుటుంబమే సూత్రధారి .. 1000 కోట్ల మోసం
.ఒకరి నుంచి మరొకరికి చైన్ సిస్టం ద్వారా ఈ ఊబిలోకి దింపుతూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసింది తెలంగాణ పోలీస్.
మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ గా చేసుకుని అన్ని ప్రాంతాలు పర్యటించి పెద్ద పెద్ద హోటల్స్ లో సభలు సమావేశాలు నిర్వహించి సులభంగా డబ్బులు సంపాదించడంటూ పక్కా ప్లాన్ తో కొందరితో ఉపన్యాసాలు ఇప్పించారు. ఇంకేముంది వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మిన మధ్యతరగతి కుటుంబాలు ఈ ఊబిలో పడిపోయాయి. ఇలా దేశవ్యాప్తంగా ఈ బిజ్ పేరుతో 1000 కోట్ల మోసం వెలుగుచూసినట్లు తెలుస్తోంది.

నోయిడా కేంద్రంగా ఈ బిజ్ .. భార్య, భర్త , కుమారుడి దందా
ఉత్తరప్రదేశ్లోని నోయిడా కేంద్రంగా ఈబిజ్ పేరుతో చేసిన చైన్ సిస్టం ద్వారా సాగిన మోసం వెలుగుచూసింది. 2001లో నోయిడా కేంద్రంగా పవన్ మల్హాన్ ఈబిజ్ కంపెనీ తెరిచాడు. ఇతను ఎండీగా, భార్య అనిత డైరెక్టర్గా, కుమారుడు హితిక్ కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించేవారు.
మిమ్మిల్ని కుబేరులుగా మారుస్తామని అయితే అందుకు రుసుము కింద రూ.16,821 కట్టించుకుంటారు. ఒకసారి సభ్యులుగా చేరిన వారు మరో ఇద్దరిని కంపెనీలో సభ్యులుగా చేర్పించాలి. వారు మరో ఇద్దరిని చేర్పిస్తే కమిషన్గా రూ.2,700 వస్తుందని చెబుతారు. కింద సభ్యులుగా చేరిన వారు సభ్యులను చేర్చుకుంటూ పోతే.. కమిషన్ కూడా పెరుగుతుందని నమ్మించారు. ఇలా చైన్ సిస్టం ద్వారా ఈ మోసానికి పాల్పడుతున్నారు.

కోట్ల సంపాదన అంటూ విద్యార్థులను , నిరుద్యోగులను మోసం చేసిన ఈ బిజ్
సభ్యుడిగా చేరిన వ్యక్తి మొదట రిప్రజెంటేటివ్ ఆ తర్వాత సిల్వర్, డైమండ్, డిప్లొమాట్, సిల్వర్ డిప్లొమాట్, గోల్డ్ డిప్లొమాట్, డైమండ్ డిప్లొమాట్, అంబాసడర్, సిల్వర్ అంబాసడర్, గోల్డ్ అంబాసడర్, డైమండ్ అంబాసడర్, చైర్మన్ సర్కిల్కు చేరుకుంటారని చెప్తారు .
డబ్బులు చెల్లించినందుకు వారికి బట్టలు, ఈ లెర్నింగ్ పేరిట ఆన్లైన్ కోర్సుల నిమిత్తం లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. వాటితో లాభమేమీ లేకున్నా సభ్యులుగా చేరితే సంపాదన లక్షలు, కోట్లు దాటుతుందన్న ఆశతో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా కళాశాలల యువతను సైతం టార్గెట్ చేసి ఈ దందా సాగింది. ఇది నిజమేనని నమ్మిన విద్యార్ధులు, నిరుద్యోగులు, మహిళలతో పాటు వివిధ రంగాలకు చెందిన లక్షల మంది ఇందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.
అలా 18 సంవత్సరాల్లో 7 లక్షల మంది నుంచి రూ.1000 కోట్లు వసూలు చేశారు ఈ మాయదారి కుటుంబం .

జగిత్యాల బాధితుడి ఫిర్యాదుతో ఈ బిజ్ కు చెక్ పెట్టిన తెలంగాణా పోలీస్
తాజాగా జగిత్యాల మండలం మహాలక్ష్మీనగర్కు చెందిన సామల వివేక్కు తెలిసిన వారు చెప్పడంతో రూ.16821 చెల్లించి సభ్యత్వం తీసుకున్నాడు. మరికొంతమందిని సభ్యులుగా చేర్చితే వారిచ్చే కమీషన్ ద్వారా రాబడి ఉంటుందని ప్రతినిధులు చెప్పడంతో తన వంతుగా 8 మందిని చేర్చాడు.అయినా ఎలాంటి సంపాదన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన సామల వివేక్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీలో ఉన్న పవన్, అనిత, అతని కుమారుడు హితిక్ను అరెస్ట్ చేశారు.బ్యాంకుల సహకారంతో ఈబిజ్కు చెందిన రూ.70.5 కోట్ల డిపాజిట్లను ఫ్రీజ్ చేశారు. ఈ కంపెనీ మోసాలపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవాలోనూ కేసులు నమోదైనట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.












Click it and Unblock the Notifications