గ్రేటర్లో మ్యాజిక్ ఫిగర్ లెక్క వేరే... మేయర్ పీఠాన్ని డిసైడ్ చేసేది ఎక్స్ అఫీషియో ఓట్లే...
అసెంబ్లీ,లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే... మొత్తం స్థానాల్లో సగం సీట్ల కన్నా ఒక్క సీటు ఎక్కువగా గెలవాలి. ఉదాహరణకు తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 119.. అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60. కానీ మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికల విషయంలో ఈ లెక్క వేరుగా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా తోడవుతాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ వాటిపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు తాజా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 వార్డులు ఉన్నాయి. అలాగే నగర పరిధిలో మొత్తం 52 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. ఈ రెండు కలిపితే మొత్తం సంఖ్య 202. కాబట్టి మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 స్థానాలను సాధించాల్సి ఉంటుంది. ఒకరకంగా పరోక్షంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉపయోపగపడుతాయి.
టీఆర్ఎస్కు కలిసొచ్చే ఎక్స్ అఫీషియో ఓట్లు...
గ్రేటర్ పరిధిలో మొత్తం 52 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్కు 38,ఎంఐఎంకు 10,బీజేపీకి 03,కాంగ్రెస్ పార్టీకి 01 ఉన్నాయి. గ్రేటర్ మేయర్ పీఠాన్ని నిర్ణయించడంలో ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఒక రకంగా ఇది అధికార టీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అంశం. ఆ పార్టీకి గ్రేటర్లో 35 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉండగా... ఇటీవల గవర్నర్ కోటాలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీల ఎక్స్ అఫిషియో ఓట్లను కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 38కి చేరనుంది.
అంటే,గ్రేటర్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే టీఆర్ఎస్ అదనంగా మరో 64 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకంటే తక్కువ స్థానాలు వచ్చినా... ఎంఐఎంకి ఎలాగూ 10 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి కాబట్టి... అవి కూడా టీఆర్ఎస్ ఖాతాలో చేరే అవకాశం లేకపోలేదు. దీంతో ఎన్నికల్లో ఒకవేళ అంచనాలు తలకిందులైనా టీఆర్ఎస్ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఎక్స్ అఫిషియో ఓట్లతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు.
బీజేపీ '99' గెలవాల్సిందే...
గ్రేటర్లో బీజేపీకి ఆ పార్టీ ఎంపీ కిషన్ రెడ్డి,ఎమ్మెల్యే రాజాసింగ్,ఎమ్మెల్సీ రామచంద్రరావుల ఎక్స్ అఫీషియో ఓట్లు జతకానున్నాయి. అయితే కేవలం 3 ఎక్స్ అఫీషియో ఓట్లు మాత్రమే ఉండటంతో... బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 99 డివిజన్లలో గెలవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో సెంచరీ మార్క్ దాటుతామని ఆ పార్టీ ధీమాగా చెబుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఎక్స్ అఫీషియోతో సంబంధం లేకుండా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు. కానీ అంచనాలు తలకిందులైతే మాత్రం ఆ పార్టీ గట్టెక్కేందుకు ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా లేవు. ఈ లెక్కన ఎక్స్ అఫీషియో ఓట్లు బీజేపీకి ప్రతికూలంగా మారాయనే చెప్పాలి.
ఎంఐఎం లెక్క ఇదీ...
గ్రేటర్ పరిధిలో ఎంఐఎంకి 10 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీ 60 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాలను దక్కించుకుంది. సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. టీఆర్ఎస్తో దోస్తీ రీత్యా... ఇరువురు ఒక అవగాహనతోనే బరిలో దిగుతారన్నది బహిరంగ సత్యం. కాబట్టి ఎంఐఎం మునుపటి స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల్లో ఫలితం తేడా కొట్టి... టీఆర్ఎస్కు ఎక్స్ అఫిషియో ఓట్లు అవసరమైతే... ఎంఐఎం అధికార పార్టీకి మద్దతు తెలుపుతుందనడంలో సందేహం అక్కర్లేదు. నిజానికి గత ఎన్నికల్ల 99 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్కు ఈసారి సొంతంగా 64 స్థానాలు గెలుచుకోవడం పెద్ద లెక్కేమీ కాకపోవచ్చు. ఆ లెక్కన ఈసారి కూడా గ్రేటర్ పీఠం టీఆర్ఎస్కే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Recommended Video
కాంగ్రెస్ పరిస్థితి ఇలా...
ఇక గ్రేటర్ పరిధిలో అన్ని పార్టీల కంటే బలహీనంగా కనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 54 స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ 2016లో మాత్రం కేవలం రెండంటే రెండు స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఆ పార్టీకి గ్రేటర్ పరిధిలో కేవలం ఒకే ఒక్క ఎక్స్ అఫిషియో ఓటు ఉంది. ఈ లెక్కన మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఆ పార్టీ 101 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. ఇటీవలి దుబ్బాక ఉపఎన్నిక ఫలితంతో ఢీలా పడ్డ ఆ పార్టీకి గెలుపు కంటే ఉనికిని చాటుకోవడమే ఇప్పుడు కీలకంగా మారింది. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీ పదుల సంఖ్యలో స్థానాలు సాధిస్తేనే రాజకీయంగా తిరిగి పుంజుకునే అవకాశాలు ఉంటాయి.