Gold smuggling: వారి మలద్వారంలో 7.3కిలోల బంగారం: షాక్ అయిన కస్టమ్స్ అధికారులు; నలుగురు అరెస్ట్!!
బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కాదేదీ బంగారు అక్రమ రవాణాకు అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఏ రూపంలో బంగారం భారత్లోకి చేరుతుందో తెలిస్తే షాక్ అయ్యే పరిస్థితి నెలకొంది. బంగారం అక్రమ రవాణా చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు స్మగ్లర్లు. పురుషులు మాత్రమే కాదు విద్యార్థులు, మహిళలు సైతం విదేశాల నుండి బంగారం అక్రమ రవాణాకు ఎవరికీ దొరకకుండా రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

నిత్యకృత్యంగా బంగారం అక్రమరవాణా
గతంలో సాక్స్ లలో, కటింగ్ ప్లేయర్ లలో, మిక్సీలలో, శరీరం లోపల వివిధ రూపాలలో బంగారాన్ని అక్రమ రవాణాకు ప్రయత్నాలు జరిగాయి. గతంలో ఒక మహిళ అండర్ వేర్ లో కోటి రూపాయల విలువైన బంగారాన్ని దాచి తీసుకు వెళుతున్న క్రమంలో లక్నోలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఇక తాజాగా మరో షాకింగ్ సంఘటన బంగారం అక్రమ రవాణా ఎంత దారుణంగా సాగుతుందో అర్థమయ్యేలా చెప్తుంది. బంగారం అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది.

అక్రమ బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించిన నలుగురు సుడాన్ జాతీయులు
విదేశీ ప్రయాణికులు బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నించడంతో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 7.3 కిలోల ద్రవరూప బంగారాన్ని నలుగురు విదేశీయులు మలద్వారంలో పెట్టుకొని తీసుకొని రావటం సంచలనం కలిగించింది. అక్రమ బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించిన నలుగురు సుడాన్ జాతీయులుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో శంషాబాద్ కు చేరుకున్న వీరి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు.

మలద్వారంలో 7.3 కిలోల బంగారం
నలుగురి వద్ద ఏమీ లభించినప్పటికీ అధికారులకు అనుమానం వెంటాడుతూనే ఉండటంతో, వైద్యుడిని పిలిపించి మలద్వారం వద్ద పరిశీలించారు. దీంతో వారి మల ద్వారాల వద్ద బంగారం బయటపడింది.7.3 కిలోల బంగారం మలద్వారం ద్వారా తీసుకురావడంతో అధికారులు షాక్ తిన్నారు. కరిగించిన బంగారం ముద్దను మలద్వారం ద్వారా లోపల పెట్టి వారు తీసుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు . పట్టుబడిన బంగారం విలువ సుమారు 3.6 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఒమిక్రాన్ పరీక్షల సమయంలో అనుమానం .. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
ఒకపక్క ఒమిక్రాన్ భయంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తుంటే, మరోపక్క ఎవరికీ దొరక్కుండా బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికి చాలామంది ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒమిక్రాన్ పరీక్షల క్రమంలోనే తాజాగా బంగారాన్ని అక్రమ రవాణాకు ప్రయత్నించిన సూడాన్ జాతీయులు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరూ మహిళలతో సహా, నలుగురి మలద్వారాలలో బంగారాన్ని గుర్తించి పట్టుకున్నారు.

బంగారం అక్రమ తరలింపు పట్టుకోవటం కస్టమ్స్ అధికారులకు పెద్ద ప్రహసనం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇలాంటి అక్రమ బంగారం తరలింపు ఘటనలు తరచు బయటపడుతూనే ఉన్నాయి. గతంలోనూ ఇలా మలద్వారం ద్వారా బంగారాన్ని తరలించిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. గతంలో క్యాప్సిల్స్ రూపంలో ఉన్న బంగారాన్ని మలద్వారంలో చొప్పించుకుని ఓ వ్యక్తి బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించాడు. అంతకు ముందు ఓ మహిళ 1200 గ్రాముల బంగారాన్ని ఎవరికీ అర్థం కాకుండా లోదుస్తులలో పెట్టుకు వచ్చింది.
ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలలోనూ బంగారం స్మగ్లింగ్ ను పట్టుకోవడం కస్టమ్స్ అధికారులకు పెద్ద ప్రహసనంగా మారింది. వారు తీసుకు వస్తున్న వస్తువులను తనిఖీ చేయడమే కాకుండా, వారి శరీర భాగాలలో లోపల కూడా బంగారం ఎక్కడైనా ఉందా అన్నది స్కాన్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications