వర్షంతో చిత్తడైన భాగ్యనగరం, పలుచోట్ల ట్రాఫిక్ జాం, జూబ్లీహిల్స్లో నెలకొరిగిన వృక్షం
హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వీధులన్నీ చెరువులను తలపించాయి. రహదారులపై ట్రాఫిక్ ఎక్కడిక్క్కడే స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ప్రధానంగా సికింద్రాబాద్, చిలకలగూడ, పద్మారావునగర్, పార్సీగుట్ట, రైల్వేస్టేషన్, సంగీత్, కూకట్పల్లి, జేఎన్టీయూ, మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్సిటీ, పంజాగుట్ట, ఖైరతాబాద్, ట్యాంక్బండ్, హిమాయత్ నగర్, జీడిమెట్ల, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
వర్షానికి హైదరాబాద్ చిత్తడి అయిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. హిమాయత్ నగర్, బషీర్ బాగ్, నారాయణగూడలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. లిబర్టీ నుంచి నారాయణ గూడ వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్ కార్మికనగర్లో భారీ వర్షం కురిసింది. వర్షంతోపాటు గాలి వీయడంతో కారు మీద భారీ వృక్షం నెలకొరిగింది. దీంతో కారు నుజ్జునజ్జయిపోయింది. కారులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
వర్షాలతో ప్రజలు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకుంటామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. రహదారులకు మరమ్మతులు చేపట్టామని వివరించారు. దీంతోపాటు సిటిలో దోమల నివారణకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. సిటీలో ఇప్పటివరకు 1,.043 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వివరించారు.
మరోవైపు శిథిల భవనాల కూల్చివేత ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు సరైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బతుకమ్మ నిమజ్జనం కోసం కాలువలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.