రేవంత్ రెడ్డి అరెస్ట్ పై మరోసారి హైకోర్టు ఆగ్రహం.. డీజీపీ హాజరుకావాలంటూ ఆదేశం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ తీరుపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆయనను అదుపులోకి తీసుకున్న తీరు సరికాదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ఈమేరకు డీజీపీ స్వయంగా వచ్చి కోర్టుకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.
రేవంత్ రెడ్డి అరెస్ట్ తో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పోలీసుల తీరును తప్పుబడుతూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. అయితే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం బుధవారం నాటి విచారణలో మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ సమాచారం నివేదికలతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో సమాచారం సరే అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. డీజీపీ స్వయంగా వచ్చి కోర్టుకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.

అసెంబ్లీ ఎలక్షన్స్ డ్యూటీలో డీజీపీ బిజీగా ఉన్నారన్న అడ్వకేట్ జనరల్ సమాధానంతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఆయన వచ్చి సమాధానం చెప్పాల్సిందేనంటూ స్పష్టం చేసింది. తదుపరి విచారణ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications