నేటి అర్ధరాత్రి నుంచి.. ఓఆర్ఆర్పై వాహనాలకు హెచ్ఎండీఏ గ్రీన్ సిగ్నల్..
లాక్ డౌన్ కారణంగా గత 2 నెలలుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే బస్సులు,ఆటోలు,క్యాబ్స్ రోడ్ల పైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ ఓఆర్ఆర్ పైకి అన్ని వాహనాలను అనుమతిస్తున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి(21వ తేదీ) నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) నిర్ణయించాయి.అయితే కర్ఫ్యూ నేపథ్యంలో రాత్రి 7గం. తర్వాత అలాగే ఉదయం 7గంటలకు ముందు ఓఆర్ఆర్ పైకి కార్లను అనుమతించరు.

ఓఆర్ఆర్ పునరుద్దరణ నేపథ్యంలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని ఆదేశించాయి. అలాగే ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లింపులకు ఫాస్ట్ టాగ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్ టాగ్ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్ఎండీఏ సూచించింది.
ఒకవేళ ఓఆర్ఆర్పై ప్రయాణించే సరుకు రవాణా వాహనాల(గూడ్స్ వెహికిల్స్)లో ప్రయాణికులను తరలిస్తున్నట్టుగా గుర్తిస్తే.. టోల్ ప్లాజా సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేయాలని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.












Click it and Unblock the Notifications