PLAN-B ఎలా తెలిసింది.. SPG కాల్పులు జరుపుతారనే..: బండి సంజయ్
పంజాబ్లో ప్రధాని మోడీ కాన్వాయ్ను అడ్డుకోవటంపై బీజేపీ శ్రేణులు ఇవాళ దేశవ్యాప్తంగా మౌనదీక్ష చేపట్టి నిరసన తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి వద్ద జరిగిన మౌనదీక్షలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గోన్నారు. ఉదయం 11 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌనదీక్షలో పాల్గోన్నారు.
ప్రధానిని అప్రతిష్టపాలు చేయటానికే పంజాబ్ ప్రభుత్వం పన్నిన కుట్ర ఇది అని అన్నారు. రహస్యంగా ఉండాల్సిన ప్రధాని పర్యటనకు సంబంధించి ప్లాన్ బీ ఎలా లీకయ్యిందని ప్రశ్నించారు. వ్యక్తికి భద్రత కల్పించేందుకు ఎస్పీజీ అనేక చర్చలు చేస్తుందని.. వానపడుతుందని వాతావరణశాఖ హెచ్చరించటంతో ప్లాన్ బీ అమలు చేశారు. ఇది ఎలా లీకయ్యిందనేదే ఇప్పుడు ప్రశ్న అని ఆయన అన్నారు. ప్లాన్ సీ ప్రకారం రైతుల పేరుతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
ప్రధానిని అడ్డుకుంటే ఎస్పీజీ సిబ్బంది కాల్పులు జరుపుతుంది. ఆ రకంగా ప్రధానిని అప్రతిష్టపాలు చేయాలని చూశారని బండి సంజయ్ అన్నారు. మోడీని అడ్డుకున్న ప్రదేశం పాకిస్తాన్కు 18 కిలోమీటర్లు దూరంలో ఉందని ఆయన తెలిపారు. పంజాబ్లో కాంగ్రెస్ ఏం మాట్లాడితే, తెలంగాణలో టీఆర్ఎస్ అదే మాట్లాడుతోందని అన్నారు. ఇలాంటి రాజకీయాలకు టీఆర్ఎస్ ఫుల్స్టాప్ పెట్టాలని బండి సంజయ్ సూచించారు.
ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ప్లాన్ బీ అమలు చేశారని బండి సంజయ్ తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారని ఆరోపించారు. ప్రధాని భద్రతా దృష్ట్యా ఎస్పీజీ సిబ్బంది ఫైరింగ్ జరుపుతారని.. అలా చేయాలని కావాలనే కాన్వాయ్ సమీపం వరకు ఆందోళనకారులు వచ్చారని తెలిపారు. మరీ దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలీ మరీ.