హైదరాబాద్ ఫుల్లీ లోడెడ్.!ఎటూ చూసినా వాహనాలే.!మళ్లీ రద్దీగా మారిన ప్రధాన చౌరస్తాలు.!
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం మళ్లీ రద్దీగా మారింది. కరోనా వైరస్ తెచ్చిన కష్టాలతో చాలా వరకు ఉపాది కోల్పోయిన చిరు ఉద్యోగులు, వలస కార్మికులు వారి వారి సొంత గ్రామాలకు తరలి వెళ్లి పోయారు. కరోనా ప్రభావం తగ్గక పోయినప్పటికి అంత ప్రమాదం కాదని తెలుకున్న వలస కూలీలు, చిరుద్యోగులు మళ్లీ నగర బాట పట్టారు. దీంతో గత ఆరు నెలలుగా ఖాళీగా కనిపించిన హైదరాబాద్ నగర రహదారులు మళ్లీ రద్దీగా మారిపోయాయి. మొన్నటి వరకూ తక్కువ వాహనాలతో చిటుక్కున రాకపోకలు సాగే ప్రధాన కూడళ్లు ఇప్పుడు వాహనాలతో కిక్కిరిసి పోతున్నాయి.
ఊళ్ల బాటనుండి మళ్లీ నగర బాట.. ఉపాది కోసం మళ్లీ హైదరాబాద్ తలుపు తడుతున్న జనాలు..
హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్య మళ్లీ మొదటికి చేరుకుంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధించిన లాక్ డైన్ ఆంక్షలతో అనేక వ్యాపార రంగాలు మూతబడ్డాయి. కొన్ని రంగాలు తీవ్ర నష్టాలను చవిచూసి శాశ్వతంగా రద్దు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. అంతే కాకుండా చాలా మంది చిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోడంతో అగమ్యగోచరంలో పడిపోయారు. ఏదైనా పని చేస్తేనే గాని జీవించలేని పరిస్ధితిలో ఉన్న అనేక మంది నగరాన్ని విడిచి సొంత గ్రామాలకు తరలి వెళ్లిపోయారు. దీంతో నగరం చాలా వరకూ ఖాళీగా కనిపించింది.
రద్దీ మారుతున్న ప్రధాన కూడళ్లు.. యధావిధిగా ట్రాఫిక్ సమస్యలు..
కాని రాను రాను పరిస్థితిల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉపాది లేక ఊరికి వెళ్లి పోయిన వారు మళ్లీ నగర బాట పడుతున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమలు, వ్యాపార కార్యక్రమాలు మళ్లీ గాడిన పడుతుండడంతో ఊళ్లకు వెళ్లిన నిరుద్యోగులందరూ జీవనోపాదికోసం మళ్లీ నగర బాట పడుతున్నట్టు నిర్దారణ అవుతోంది. ప్రయివేట్ సెక్టార్ లో అన్ని కార్యక్రమాలు మళ్లీ పునరుద్దరించబడడంతో కోవిడ్ నియమాలు పాటిస్తూ వ్యవస్థలను ట్రాక్ లో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్ తో నగరంలో తగ్గిన జనం.. మళ్లీ ఉద్యోగాల్లో చేరిపోతున్న చిరు ఉద్యోగులు..
దీంట్లో భాగంగా దాదాపు 30లక్షల వరకూ జనాలు సొంత ఊళ్లకు పయనం కావడంతో మొన్నటి వరకూ అత్యంత ఖాళీగా కనిపించిన నగర రహదారులు మళ్లీ జనసాంద్రతతో కనిపిస్తున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు అయిన ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, పాట్నీ సెంటర్, బేగంపేట, పంజాగుట్ట, మైత్రీవనమ్, యూసఫ్ గూడ సర్కిల్, జూబ్లీ చెక్ పోస్ట్, హైటెక్ సిటీ, ఖైరతాబాద్, రవీంధ్ర భారతీ జంక్షన్, నాంపల్లి, కోటి తదితర కూడళ్లలో ట్రాఫిక్ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తోంది. దీంతో నగరంనుండి వెళ్లిపోయిన జనం అంతా తిరుగుముఖం పట్టినట్టు నిర్దారణ అవుతోంది.
Recommended Video
తగ్గుతున్న వైరస్ ప్రభావం.. గాడిన పడుతున్న అనేక రంగాలు..
అంతే కాకుండా హైదరాబాద్ నగరం అత్యంత జీవనోపాది కల్పించే అద్బుత నగరంతో పాటు భిన్న సంస్కృతుల సమాహారంగా బాసిల్లుతుందని, దేశం నలుమూలలనుండి ఎవరైనా హైదరాబాద్ నగరంలో జీవనం కొనసాగించేందుకు అనువుగా ఉంటుందని పలు సందర్బాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఊటంకించారు. అందుకు తగ్గట్టే హైదరాబాద్ నగరంపైన కరోనా ప్రభావం చూపించినా అది తాత్కాలికమే అని రుజువయ్యింది. నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిన అనేక మంది జీవనోపాదికోసం మళ్లీ హైదరాబాద్ తలుపు తట్టడం నగరం యొక్క గొప్పతనంగా తెలస్తోంది. దీంతో ఐదు నెలల క్రితం గ్రామాలకు తరలి వెళ్లిన అనేక కుటుంబాలు మళ్లీ నగరానికి చేరుకోవడంతో నగర రహదారులు మళ్లీ రద్దీగా తయారయ్యాయి.