ఏపీ-తెలంగాణలోకి వాహనాలకు లైన్క్లియర్: వచ్చే వారం నుంచి హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సేవలు
హైదరాబాద్: తెలంగాణలో పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేయడంతో హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైలు సేవలు వచ్చే వారం నుంచి పునర్ ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, కరోనా లాక్డౌన్ కారణంగా ఏడాదిన్నరగా ఎంఎంటీఎస్ రైలు ఆగిపోయిన విషయం తెలిసిందే.

నగర ప్రజలకు భారీ ఉపశమనం..
ఈ కారణంగా చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలో రూ. 5, రూ. 10కే ప్రయాణించే ప్రజలు.. ఇప్పుడు సరైన రవాణా సౌకర్యం లేక వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఎంటీఎస్ రైళ్లను పునర్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు కేంద్రమంత్రి.
ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు ప్రారంభం కావడంతో దిగువ మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులకు చవకైన, సురక్షిత రవాణా సదుపాయం కలుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

కరోనా నిబంధనలకు లోబడే..
కరోనా నిబంధనలకు లోబడే ఎంఎంటీఎస్ సేవలు కొనసాగుతాయన్నారు. ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోవాలని కేంద్రమంత్రి కోరారు. తన విన్నపం మేరకు ఎంఎంటీఎస్ సేవలను పునర్ ప్రారంభించేందుకు అంగీకరించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు హైదరాబాద్ మహానగర ప్రజల పక్షాన కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

ఏపీ నుంచి వచ్చే వాహనాలకు లైన్ క్లియర్..
మరోవైపు తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు కూడా ఇప్పటి వరకు కొనసాగిన ఆటంకాలు తొలగిపోయాయి. ఇకపై పాస్ అవసరం లేకుండానే తెలంగాణలోకి రావచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. అర్ధరాత్రి నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణలోకి వాహనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఏపీలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో ఏపీకి వెళ్లాలంటే మాత్రం పాస్ తప్పనిసరి అని అధికారులు వెళ్లడించారు. కాగా, తెలంగాణతోపాటు ఏపీలోనూ గత కొద్ది వారాలుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications