ఉద్యోగాల పేరుతో భారీ మోసం... ఫేక్ ఇంటర్వ్యూలు,ఫేక్ ఆఫర్ లెటర్స్...
ఇటీవలి కాలంలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు పెరిగిపోయాయి. ప్రముఖ కంపెనీల పేరు చెప్పి ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి కొన్ని ముఠాలు నిరుద్యోగాలను బురిడీ కొట్టిస్తున్నాయి. లక్నో కేంద్రంగా ఇలాగే మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా దందాను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు. ఉద్యోగాల కోసం ఆన్లైన్ జాబ్ పోర్టల్స్లో అప్లై చేసుకునే ఎంతోమందిని ఈ ముఠా మోసం చేసినట్లు గుర్తించారు.
ఈ ముఠా మోసాలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. లక్నో కేంద్రంగా నిరుద్యోగులకు టోకరా వేస్తున్న ఓ ముఠాని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో అన్సారీ,యుగంధర్ శ్రీవాస్తవ,తుషార్ శ్రీవాస్తవలు అనే ముగ్గురు వ్యక్తులు నిరుద్యోగులను మోసం చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. ఈ ముగ్గురు విద్యార్థులేనని చెప్పారు.

ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీలో అప్లోడ్ చేసిన రెజ్యూమ్లను తీసుకుని వీరు నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు చెప్పారు. కెరీర్ స్టైల్ పేరుతో ఈ ముఠా ఓ నకిలీ జాబ్ పోర్టల్ కూడా క్రియేట్ చేసిందన్నారు.
ఇటీవల ఓ డెలాయిట్ ఉద్యోగికి ఫోన్ చేసిన ఈ ముఠా ఓ ప్రముఖ కంపెనీ పేరు చెప్పి బురిడీ కొట్టించిందన్నారు. ఫేక్ లెటర్,ఫేక్ ఇంటర్వ్యూ చేసి ఫేక్ ఆఫర్ లెటర్ ఇచ్చిందన్నారు. ఇలా రెండు నెలల కాలంలో ఎంతోమంది నిరుద్యోగులను బురిడీ కొట్టించి ఉద్యోగాల పేరుతో వారి నుంచి రూ.38లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ముఠాల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications