మందుబాబులకు షాక్.. పండగని గుమిగూడొద్దు, బయట తిరగొద్దు: సీపీ
హోలీ సందర్భంగా మందుబాబులకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో గల వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని స్పష్టంచేశారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
పండుగ పూట ఇతరులకు అసౌకర్యం కలిగించొద్దు అని స్పష్టంచేశారు. రోడ్లపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం, బలవంతంగా రంగులు చల్లడం వంటి చర్యలను నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. మరో నాలుగు రోజుల్లో హోలీ పండుగ రాబోతున్న సంగతి తెలిసిందే. హోలీ రోజున రంగులతో ఆటలే కాకుండా ఫుల్గా తాగి రోడ్లపై తాగుబోతులు వీరంగం సృష్టిస్తుంటారు.
మందుబాబులతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వీటికి చెక్ పెట్టడానికి హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. హోలీ సందర్భంగా జంట నగరాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వైన్ షాపులు క్లోజ్ చేయిస్తున్నారు. హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారు.
పండగ సందర్భంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రజలు జరుపుకోవాలని కోరారు. ఇందుకోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. గీత దాటితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.