కేఏ పాల్ మళ్లీ వేశాడు: ఈసారి రాజ్యసభ అభ్యర్థులపై.. అమరవీరుల కుటుంబాలు ఏం పాపం చేశాయని..?
కేఏ పాల్ ఇటీవల యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలపై తనదైన కామెంట్లు చేస్తున్నారు. సిద్దిపేటలో పాల్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీ.. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. అయితే తెలంగాణ కోటాలో ఎన్నికలు జరిగే మూడు రాజ్యసభ సీట్లకు టీఆర్ఎస్ పార్టీ బుధవారం ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కేఏ పాల్ స్పందించారు.
ఆ ముగ్గురేనా..?
హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ దీనకొండ దామోదరరావు, గ్రానైట్ పరిశ్రమల అధినేత మద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను టీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ ముగ్గురిపై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరేమో మైనింగ్ డాన్, మరొకరేమో రూ.500 కోట్ల స్కామ్లో పట్టుబడిన వ్యక్తి, ఇంకొకరేమో భూకబ్జాలు చేసిన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురికి ఏ అర్హత ఉందని రాజ్యసభ సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు.
అమరవీరుల కుటుంబాల
తెలంగాణ రాష్ట్రంలో 1200 అమరవీరుల కుటుంబాల్లో రాజ్యసభకు పంపే అర్హత ఉన్న వారు ఒక్కరూ లేరా? అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, తక్షణమే వీరి ముగ్గురు అభ్యర్థిత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మూడు రాజ్యసభ సీట్లను అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని పాల్ డిమాండ్ చేశారు.
ఆఫర్..
మరోవైపు మంద కృష్ణ మాదిగకు ఆఫర్ ఇచ్చారు. మందకృష్ణ తనతో కలిసి పని చేయాలని కోరారు. అలా చేస్తే మంత్రిని చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏళ్లుగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ఏం సాధించారని కేఏ పాల్ ప్రశ్నించారు. అందుకే అతనికి పదవీ ఇస్తానని ఆఫర్ చేశారు. అంతేకాదు విద్యావంతులు తన పార్టీలో చేరాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ భ్రష్టుపట్టిపోయాయనని కామెంట్ చేశారు. తనకు 2012లో ఎంపీ సీటు, మంత్రి పదవి ఆఫర్ వచ్చినా తిరస్కరించానని చెప్పారు. అమిత్షా స్వయంగా మంత్రి పదవి ఇస్తానని తనకు చెప్పినట్లు కేఏ పాల్ తెలిపారు. అయినా తాను తీసుకోలేదని చెప్పారు.
దాడితో మారిన సీన్
కేఏ పాల్పై ఇటీవల సిద్దిపేటలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఆయన చెంపచెల్ అనిపించాడు. అతను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది. కేఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నారు.
పోలీసులు జక్కాపూర్ వద్ద అడ్డుకున్నారు. మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్ను చెంప మీద కొట్టాడు. హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవకు దిగారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తర్వాత డీజీపీని కలిసే ప్రయత్నం చేయడం.. హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థులపై కామెంట్ చేశారు.