కేసీఆర్ ప్రధాని అయ్యారంటే.. దేశమంతా సంక్షేమమే, మంత్రి మల్లారెడ్డి కామెంట్స్
మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడిన సంచలనమే. ఇటీవల హాట్ కామెంట్స్ ఎక్కవ అవుతున్నాయి. అందులో సెటైర్స్ కూడా ఉంటున్నాయి. అసెంబ్లీ, మీడియా ఎక్కడైన మల్లారెడ్డి మాటతీరే వేరు. విపక్షాన్ని ఎద్దేవాచేస్తూ స్వపక్షంపై పొగడ్తలు గుప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇటీవల రాష్ట్రంలో సీఎంగా మంత్రి కేటీఆర్ను చేయాలని టీఆర్ఎస్ శ్రేణులతోపాటు కేబినెట్లో మంత్రులు నినదిస్తున్నారు.
వీరిలో మల్లారెడ్డి ముందువరుసలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్ను ప్రధానమంత్రిగా చూడాలని ఆరాటపడుతున్నారు. ఆయన ఆకాంక్షను ఏకంగా అసెంబ్లీలోనే బయటపెట్టారు. కేసీఆర్ ప్రధాని అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టే.. దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్తారని చెప్పారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని మల్లారెడ్డి అంచనా.. దేశ చరిత్ర మారిపోతుందని జ్యోస్యం చెప్పారు.
కేంద్రప్రభుత్వం, ప్రతిపక్షంపై మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్తోపాటు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఆ ప్రభుత్వాల హయాంలో చేసింది శూన్యం అని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తోందని మల్లారెడ్డి దుయ్యబట్టారు.
మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఇదివరకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ హంగామా చేసిన సంగతి తెలిసిందే. 16 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని ఆరాటపడిన ఫలితం లేకుండా పోయింది. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులు కూడా విజయం సాధించారు. అయితే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ మరోసారి రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.