తెలంగాణలో గవర్నర్ మార్పు..? నరసింహన్తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్ : తెలంగాణకు కూడా కొత్త గవర్నర్ను నియమించనుందా ? నరసింహన్ స్థానంలో మరొకరిని నియమిస్తారా అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇటీవలే ఏపీకి విశ్వభూషణ్ హరిచందన్ను గవర్నర్గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణకు కూడా కొత్త రాజ్యాధినేతను నియమిస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నరసింహన్తో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కీ మీట్
కాసేపటి క్రితం గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మున్సిపల్ చట్టం ఆమోదం పొందేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ 4 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీ, మండలిలో కొత్త మున్సిపల్ యాక్ట్ చట్టం రూపం దాల్చనుంది. అయితే ఈ క్రమంలో కేసీఆర్ సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో, లేదంటే విభజన హామీలు .. ఇతర కీలక అంశాల సమయంలోనే గవర్నర్తో సీఎం భేటీ అవుతుంటారు. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేకపోవడం, ఇటీవలే ఏపీకి కొత్త గవర్నర్ నియమించడంతో గవర్నర్ మార్పు జరుగుతుందా అనే అంశం చర్చకు దారితీసింది.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఉమ్మడి ఏపీకి గవర్నర్గా నరసింహన్ పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా నరసింహన్ కొనసాగారు. ఇటీవలే ఏపీ గవర్నర్గా ఒడిశాకు చెందిన విశ్వభూషణ్ హరిచందన్ను కేంద్రం సిఫారసుతో రాష్ట్రపతి నియమించారు. ఇక మిగిలింది తెలంగాణ అయినందున .. ఇక్కడ కూడా గవర్నర్ మారుస్తారనే వాదనకు బలం చేకూరుతుంది. ఈ క్రమంలోనే నరసింహన్తో కేసీఆర్ భేటీ అయినట్టు తెలుస్తోంది. గవర్నర్ మార్పుపై గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న .. ఇప్పటివరకు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కానీ కేసీఆర్ గవర్నర్తో సమావేశం నేపథ్యంలో మార్పు తథ్యమేనా అనే సంకేతాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications