ఆ సర్వే చేస్తున్న టీచర్లకు చేదు అనుభవం.. ఎన్ఆర్సీగా భావించి అడ్డుకున్న స్థానికులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిరక్షరాస్యత నిర్మూలన సర్వే కార్యక్రమం ఇద్దరి టీచర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 18 ఏళ్లకు పైబడి నిరక్షరాస్యత కలిగి ఉన్న వారిని లెక్కించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ ప్రక్రియ 10 రోజుల్లోగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇద్దరు టీచర్లు సర్వే కోసం చాంద్రాయణగుట్టకు ప్రాంతానికి వెళ్లారు. సర్వే నిర్వహిస్తున్న సమయంలో కొందరు అక్కడికి చేరి వారి ఐడీ కార్డులను లాక్కునే ప్రయత్నం చేశారు.

సర్వే సందర్భంగా టీచర్లకు చేదు అనుభవం
నిరక్షరాస్యత నిర్మూలన సర్వేలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఇద్దరు టీచర్లు ఉమ మరియు నందినిలు సర్వే చేస్తుండగా కొందరు వారిని అడ్డుకున్నారు. వివాదాస్పద ఎన్ఆర్సీ కోసం సమాచారం సేకరిస్తున్నారని భావించి టీచర్ల ఐడీ కార్డులు లాక్కున్నారు. 18 ఏళ్ల వయసు పైబడి చదువురాని వారి సంఖ్య గురించి సర్వే చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం భావించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ప్రక్రియను 10 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ ఇద్దరు టీచర్లు సర్వే చేస్తుండగా ఓ వ్యక్తి వీరిని అడ్డుకున్నారు. వెంటనే అక్కడికి మరికొందరు చేరుకున్నారు. వెంటనే అక్కడ జరుగుతున్న తంతును సెల్ఫోన్లతో వీడియో రికార్డింగ్ చేశారు. అసలు ఎందుకు తమ సమాచారం కోరుతున్నారో ముందుగా చెప్పాలంటూ టీచర్లను స్థానికులు నిలదీశారు.
ఐడీ కార్డుపై అధికారిక స్టాంపు లేదు
ఇక టీచర్లు ధరించిన ఐడీ కార్డుపై ముందుగా ఓ వ్యక్తి ప్రశ్నించారు. ఐడీ కార్డుపై ఎలాంటి అధికారిక స్టాంపు గుర్తు లేదని అన్నారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ నెంబరు కూడా ఐడీ కార్డుపై లేదని దీన్ని ఎలా నమ్మమంటారని ప్రశ్నించారు. మరోవైపు ఇలాంటిది ఒక సర్వే ఉందని తొలిసారిగా వింటున్నామని ఆ వ్యక్తి టీచర్లతో చెప్పడం వీడియోలో రికార్డ్ అయ్యింది. వెంటనే మరో వ్యక్తి జోక్యం చేసుకుని మాట్లాడాడు. ఇంత ఆకస్మికంగా ఇలాంటి సర్వేను ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. ఇంతకుముందే టీవీల్లో, న్యూస్ పేపర్లో నిరక్ష్యరాస్యత నిర్మూలన సర్వేకు సంబంధిచి ప్రకటనలు వచ్చాయని టీచర్ చెప్పే ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రకటనలు ఉన్న పేపర్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. దేశంలో ఏం జరుగుతోందో తెలుసు కదా అని గద్దించిన వ్యక్తి సరైన ఆధారాలు లేకుండా సర్వేల పేరుతో ఎలా వస్తారని టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీచర్లు
ఇలా అక్కడి స్థానికులతో దాదాపు 20 నిమిషాల పాటు వాదనలు జరిగాయని ఉమ అనే ఒక టీచర్ చెప్పారు. తాను స్థానికంగా ఉండే మనిషి అయినప్పటికీ వారు నమ్మలేదని ఉమ చెప్పారు. ఐడీ కార్డులు లాక్కోవడంతో ఇక చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు ఉమ చెప్పారు. తమ ఫోన్ నెంబరు ఇచ్చామని, వార్డు మెంబర్ను కూడా పిలిపించామని అయినప్పటికీ వారిని తమ ఉద్యోగం చేసుకోకుండా అడ్డుపడ్డారని ఉమ చెప్పారు.
Recommended Video


ఎన్ఆర్సీ సర్వే అని భావించిన స్థానికులు
దేశంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) ప్రక్రియ ప్రారంభం అవుతుందనే వార్తలు వచ్చినప్పటి నుంచి ముస్లిం సామాజిక వర్గాల్లో ఒక్కింత ఆందోళన కలవరపాటు వ్యక్తమవుతోంది. భారత పౌరసత్వం కోల్పోతామేమో అనే భయం వారిని వెంటాడుతోంది. ఇదిలా ఉంటే 2021 జనాభా లెక్కల ప్రకారమే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ప్రక్రియ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఇక నిరక్షరాస్యత నిర్మూలన సర్వేతో ఇటు ముస్లిం సామాజిక వర్గాల్లో భయాందోళనలు వ్యక్తం కావడం ఒకటైతే... సర్వే చేస్తున్న టీచర్లపై దాడులు జరిగే అవకాశం ఉందన్న మరో అనుమానం కలుగుతోంది.












Click it and Unblock the Notifications