Hyderabad: మరికొద్ది గంటల్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం..!
భారత వాతావరణ శాఖ హైదరాబాద్ (IMD-H) అంచనా ప్రకారం బుధవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని కొన్ని ప్రాంతాల వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, నాగోల్, సరూర్నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సైదాబాద్, సంతోష్నగర్, చార్మినార్, చంద్రాయణగుట్ట, అంబర్పేట్, ఉప్పల్, ఘట్కేసర్, ఫిర్జాదిగూడ పరిధిలో భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి శంషాబాద్ సహా ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఈదురుగాలులతో కుండపోతగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చార్మినార్, బహదూర్పురా, జూ పార్క్ పరిసరాల్లో రాజేంద్ర నగర్ వైపు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు గురువారం వరకు కొనసాగవచ్చని అంచనా వేసింది. రానున్న కొన్ని గంటల్లో కాప్రా, ఉప్పల్, ఎల్బి నగర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. మల్కాజిగిరి నుంచి వచ్చే క్లౌడ్ బ్యాండ్ వాన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మంగళవారం రాత్రి కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, ఐఎస్ సదన్, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్,సరూర్ నగర్, చంపాపేట్, సైదాబాద్, సంతోష్నగర్, మలక్ పేట్, చాదర్ఘాట్, కోఠి వంటి తదితర ప్రాంతాల్లో భారీ భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని, ఇది శుక్రవారం నాటికి తీవ్ర తుఫానుగా మారవచ్చని వివరించింది.
ఇది ఉత్తర వాయువ్య దిశగా మే 11 వరకు కదిలి తర్వాత దిశ మార్చుకుని ఉత్తర -ఈశాన్య దిశగా బంగ్లాదేశ్ -మయన్మార్ తీరం వైపు వెళ్తుందని తెలిపింది. ఉపరితల ద్రోణి తెలంగాణ నుంచి తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు హైదరాబాద్ లో ఉష్ణోగ్రత 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుందని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications