కరోనాతో సహజీవనం తప్పేలా లేదు.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..
కరోనాను తరిమికొడుదాం అన్న నినాదం నుంచి ఇక కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందేనన్న నిర్ణయానికి వస్తున్నాయి ప్రభుత్వాలు. వాస్తవ పరిస్థితులు,ప్రపంచవ్యాప్తంగా వెల్లడవుతున్న అధ్యయనాలు.. కరోనా సుదీర్ఘ కాలం ఉనికిలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కరోనాతో సహజీవనం చేస్తూనే వైరస్ నియంత్రణకు కావాల్సిన చర్యలపై దృష్టి సారించడం మొదలుపెడుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని అంబేడ్కర్ నగర్లో కరుణ క్రాంతి ఆధ్వర్యంలో 1400 మందికి ఆయన నిత్యావసరాలు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
24 గంటల్లో 43 కేసులు..!ఏపీని వదల బొమ్మాళీ అంటున్న కరోనా..!!
కరోనాతో సహజీవనం తప్పేలా లేదని.. కాబట్టి కరోనాను అందరం కలిసి ఐక్యంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. సిద్దిపేట గ్రీన్ జోన్లోనే ఉంది కదా.. మనకేమవుతుందిలే అన్న నిర్లక్ష్యం తగదన్నారు. మాస్క్ ధరించకుండా బయటకొస్తే రూ.1000 ఫైన్ తప్పదన్నారు. కరోనా కష్ట కాలంలో అనేక మంది దాతలు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే ఇప్పటికీ 12వేల మందికి సాయం అందించినట్టు తెలిపారు.
కరోనా లాక్ డౌన్లో ప్రభుత్వం ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటుందని,అందరికీ అండగా నిలుస్తుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగానే అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ.1500 ఆర్థిక సాయం అందజేస్తోందన్నారు.
కాగా,తెలంగాణలో ఇప్పటివరకూ 1132 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 727 మంది కోలుకుని డిశ్చార్జి అవగా.. 29 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 376 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.