చేతనైతే చెప్పండి.. హీరోగిరీ చేయొద్దు: అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే.. అధికార పక్షం సభ్యులు కౌంటర్లు ఇస్తున్నారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జీరో అవర్లో మున్సిపాలిటీల అభివృద్ధిపై చర్చ జరిగింది.

ఒక్క రూపాయీ రాలేదు..
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య సంవాదం చోటు చేసుకుంది. మునుగోడు, చండూరు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. చోటుప్పల్ మున్సిపాలిటీకి రూ. 20 కోట్లు, చండూరు మున్సిపాలిటీకి రూ. 10 కోట్లు మంజూరై రెండేళ్లయినా ఒక్క రూపాయి విడుదల కాలేదని అన్నారు.

చేయగలిగినవే చెప్పండి..
సాధ్యంకాని హమీలు ఇవ్వొద్దని.. ప్రభుత్వం చేయగలిగినవే చెప్పాలని అన్నారు. రాష్ట్రమంటే సిరిసిల్ల, సిద్దిపేట మాత్రమే కాదని.. ఇంకా ఎన్నో మున్సిపాలిటీలు, నియోజకవర్గాలు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని అన్నారు.

అభివృద్ధి చేయకుంటే ఎలా గెలిచాం?
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా రూ. 148 కోట్ల నిధులు మున్సిపాలిటీలకు విడుదల చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లుగా తామేమీ అభివృద్ధి చేయకుంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 130 మున్సిపాలిటీల్లో 122 స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రశ్నించారు.

హిరోగిరీ చేస్తామంటే కుదరదు..
వాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని, అవాస్తవాలను ప్రచారం చేయొద్దని రాజగోపాల్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ జీరో అవర్లో మైక్ ఇచ్చినా హీరోగిరీ చేస్తామంటే మంచిది కాదని మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
కాగా, సభలో గురువారం ఆసార పెన్షన్లు, ఆయిల్ ఫాం సాగు, గ్రామపంచాయతీల అభివృద్ధి, ప్రజారోగ్య వ్యవస్థ, తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. ఇక శుక్రవారం కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications