ఏపీ తిప్పి చూపిస్తా.. వెల్ కం కేటీఆర్, రోడ్స్ కామెంట్లపై రోజా, కేసీఆర్తో భేటీ తర్వాత..
ఏపీలో రహదారుల గురించి మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. వెంటనే ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు కౌంటర్ అటాక్ చేశారు. తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మంత్రి, ఫైర్ బ్రాంబ్ రోజా వంతు వచ్చింది. అయితే ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసిన తర్వాత కామెంట్ చేశారు. ఒకసారి ఏపీ రావాలని.. సమయం ఇవ్వాలని మీడియా ముఖంగా రోజా చెప్పారు. డేట్, టైం చెప్పాలని కోరారు.
కేటీఆర్ కామెంట్ల కలకలం..
రోడ్లు, మౌలిక వసతుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దారుణంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా స్పందించారు. కేటీఆర్ ఏపీకి వచ్చి చూసి కామెంట్ ఉంటే బాగుండేదని హితవు పలికారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు. ఏపీ పరిస్థితుల గురించి ఎవరో చెప్పారని కేటీఆర్ అంటున్నారని, ఆ చెప్పిందెవరో గానీ కేటీఆర్ను తప్పుదోవ పట్టించారని వెల్లడించారు.
యంగ్ డైనమిక్ లీడర్ ఇలా..
ఆ కామెంట్స్ వాట్సాప్లో చూశానని.. యంగ్ డైనమిక్ లీడర్గా కేటీఆర్ను అందరం గుర్తిస్తాం అని చెప్పారు. అలాంటి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారని అనుకోనని.. ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ఎక్కడా ఏపీ అనే పదం వాడలేదని గుర్తుచేశారు.
పొరుగు రాష్ట్రాలు అనే మాట వాడారని.. ఒకవేళ ఏపీ గురించి అనుంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. టూరిజం మినిస్టర్గా కేటీఆర్ను ఏపీకి ఆహ్వానిస్తున్నా అని చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకునే సీఎం జగన్ పాలనలో ఏపీ ఎలా ఉందో చూడాలని కోరారు.
స్వాగతం.. సుస్వాగతం
అంతర్గత రహదారులు, కేంద్రంతో కలిసి నిర్మిస్తున్న జాతీయ రహదారులను కూడా చూపిస్తామని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడును కూడా ఆకర్షిస్తున్న ఏపీ వాలంటీర్ వ్యవస్థ.. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్న తీరును చూపిస్తానని రోజా పేర్కొన్నారు.
ఇవీ చూపితే తెలంగాణలో ప్రవేశపెట్టాలని కేటీఆర్ తప్పక అనుకుంటారని... ఆ ఫ్రెండు చెప్పింది తప్పు అని కూడా కేటీఆర్ తెలుసుకుంటారని భావిస్తున్నానని రోజా పేర్కొన్నారు. ఏపీకి ఎప్పుడు వస్తారో డేట్, టైమ్ చెబితే వెయిట్ చేస్తానని తెలిపారు. కేటీఆర్కు స్వాగతం పలికి, టూరిజం మినిస్టర్ హోదాలో రాష్ట్రమంతా తిప్పి చూపిస్తానని చెప్పారు.
తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో కరెంట్ కోతలు..?
దేశంలో తెలంగాణతో సహా 16 రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని, అది అందరికీ తెలిసిన విషయమేనని రోజా అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పనులు కొనసాగుతున్నాయని.. కేటీఆర్ వచ్చి చూస్తే అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. పక్కనున్న వాళ్ల మాటలు నమ్మి టీవీ చానళ్ల ముందు చెబితే ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కేటీఆర్ గుర్తించాలని రోజా హితవు పలికారు. కేటీఆర్ స్వయంగా వచ్చి ఏపీలో పరిస్థితులు చూసి.. అప్పుడు మాట్లాడాలని రోజా సూచించారు. మరీ రోజా ఆఫర్కు కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలీ మరీ.