ఉప్పల్ చెరువు వద్ద నిలిచిన నీరు.. పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్
గత ఐదారురోజుల నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. చిన్న చినుకు పడితేనే ఇబ్బందిపడే కొన్ని కాలనీలకు చెందిన ప్రజలు.. వర్ష బీభత్సంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కొన్నిచోట్ల కొండ చరియలు, మరికొన్ని చోట్ల ఇంటి పై కప్పులు కూలడం, భారీ వృక్షాలు విరిగిపడుతున్నాయి. నిన్న బండ్లగూడలో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్లో భారీ వర్షం .. నోళ్ళు తెరిచిన మ్యాన్ హాల్స్ .. జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ
ఉప్పల్ చెరువు వద్ద నీరు నిలిచింది. దీంతో కాలనీవాసుల గోస అంత ఇంతా కాదు. అయితే ఆ ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఆయనతో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసయొద్దీన్ ఉన్నారు. వరదనీరు నిలిచిన నీటిని తరలించేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. స్థానిక నేతలు, అధికారులు సమన్వయం చేసుకొని.. సహాయక చర్యలు చేపడుతున్నారు.
తర్వాత మొండా మార్కెట్లోని నాలా బాజార్ నాలాలో జేసీబీతో పూడిక తొలగించే పనులు చేపట్టారు. పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. ఇటు దిల్ సుఖ్ నగర్ సాహితీ అపార్ట్ మెంట్ సెల్లార్ నీటిలో మునిగి అజిత్ సాయి అనే మూడేళ్ల బాలుడు చనిపోయాడు. నిన్న కురిసిన వర్షానికి అపార్ట్ మెంట్ సెల్లర్ లోకి వరదనీరు వచ్చింది.
ఉదయం బాబు ఆడుకుంటూ కిందకు వెళ్లి నీటిలో పడగా.. బాబును గమనించిన తండ్రి యుగేంద్రర్ కిందకి వెళ్లాడు. నీళ్లలో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు.