ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతూ తమిళనాడు వైపు కదులుతోందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు
యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలతో ద్రోణి కారణంగా తూర్పు, ఈశాన్య గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక నవంబర్ 26వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయని, మరో అల్పపీడనం ఏర్పడే వరకు ఇదే కొనసాగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు రోజులు ఉదయం పొగమంచు కురుస్తుందని తెలిపారు.
కోస్తా, రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు
ఉత్తరకోస్తాంధ్రలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తతరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్రలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఒకటి రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలితీవ్రత ప్రజలను వణికిస్తోంది. సాయంత్రం నుంచి ఉదయం వరకు మంచు దుప్పటి కప్పుకుంటుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఏపీలో తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు ప్రాంతాలను మంచు కమ్మేస్తోంది. పొగమంచుతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాలు పొగమంచులోనే ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో 10-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటోంది.