జీహెచ్ఎంసీ ఎన్నికలు : రిజర్వేషన్లపై లంచ్ మోషన్ పిటిషన్... అత్యవసర విచారణ కుదరదన్న హైకోర్టు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై రొటేషన్ పద్దతిని అనుసరించకపోవడం చట్టవిరుద్దమని పేర్కొంటూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. తాజాగా విడుదలైన జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్లో.. గ్రేటర్ పరిధిలోని 150 వార్డులకు 2016 నాటి రిజర్వేషన్లనే కొనసాగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రిజర్వేషన్లు ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... పోలింగ్,కౌంటింగ్ తేదీలు ఇవే...
సాధారణంగా రొటేషన్ పద్దతిలో... ఇప్పటివరకూ అవకాశం రాని సామాజికవర్గాల జనాభాను అనుసరించి రిజర్వేషన్లు అమలుచేస్తారు. అయితే జీహెచ్ఎంసీ పాలకమండలి రిజర్వేషన్లను రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ఈసారి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. పాత రిజర్వేషన్ల ప్రకారం... గ్రేటర్ హైదరాబాద్లో ఎస్టీలకు 2 డివిజన్లు, ఎస్సీలకు 10 డివిజన్లు రిజర్వు కాగా, మొత్తంగా మహిళలకు 75 డివిజన్లను రిజర్వు చేశారు. 44 డివిజన్లు అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నాయి.
అంతకుముందు,ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికలపై స్టే ఇవ్వాలని పిల్లో శ్రవణ్ పేర్కొన్నారు.విద్యారంగంలో బీసీల రిజర్వేషన్లు, రాజకీయ బీసీ రిజర్వేషన్లు వేర్వేరు అని తెలిపారు. రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ లేదని పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఈ వాదనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబీసీలపై అంత ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదనని ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్ రాబోయే చివరి నిమిషంలోనే ఈ విషయం ఎందుకు గుర్తుకొచ్చిందని మండిపడింది. రాజకీయ దురుద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. ఎన్నికలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీచేసింది. దీనిపై 2015, 2016లో దాఖలైన పిటిషన్లను జత చేయాలని రిజిస్ట్రార్ను హైకోర్టు ఆదేశించింది.
Recommended Video
ఇక మంగళవారం(నవంబర్ 16) ఉదయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల షెడ్యూల్,నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా... డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు. బుధవారం(నవంబర్ 17) నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 20గా నిర్ణయించారు. నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. మొత్తం 14 రోజుల్లో డిసెంబర్ 6వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం(నవంబర్ 17) మీడియాకు వివరాలు వెల్లడించారు.