కార్పొరేటర్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా.. పజ్జన్న ప్రస్థానం
హైదరాబాద్ : సికింద్రాబాద్ ముఖచిత్రంపై ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాట యోధుడు. గులాబీ బాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కౌన్సిలర్ గా పొలిటికల్ ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన రాజకీయ ధీరోదాత్తుడు. నోటినిండా తమలపాకు ఎరుపు, నుదుటిన కుంకుమ బొట్టు.. అలా నిండైన ఆహార్యంతో చూడగానే ఆకట్టుకుంటారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా పొలిటికల్ కెరీర్ ను పదిలంగా బ్యాలన్స్ చేసుకుంటున్న తీగుళ్ల పద్మారావు గౌడ్ పై స్పెషల్ స్టోరీ.
అయినవారికి అండగా..!
పెదాలపై చెరగని చిరునవ్వుతో అందరిని ఆప్యాయంగా పలకరించడం పద్మారావు గౌడ్ నైజం. ఆయన సన్నిహితులు పిలుచుకునే ముద్దుపేరు పజ్జన్న. అన్నా అంటే చాలు అల్లుకుపోయే స్వభావమున్న పజ్జన్న.. ఏ కార్యానికి పిలిచినా వచ్చేస్తారు. కలగొలుపు మనిషిగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తారు. అయినవారికి, అనుచరులకు కష్టమొచ్చిందంటే అండగా నిలబడతారు. భార్య, నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్న పజ్జన్నకు.. సికింద్రాబాద్ లో బంధుగణం చాలా పెద్దదే. గౌడ కులానికి చెందిన పజ్జన్న.. కులమతాలకతీతంగా అందరిని కలుపుకుని పోతారనే పేరుంది.
19 ఏళ్లకే పొలిటికల్ ఎంట్రీ
1954, ఏప్రిల్ 7న సికింద్రాబాద్ లో జన్మించారు పద్మారావు గౌడ్. ఎస్పీ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అనంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పజ్జన్న. 19 ఏళ్ల వయసులోనే అంటే 1973లో యువజన కాంగ్రెస్ లో చేరారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నగర, రాష్ట్ర పదవులు నిర్వర్తించారు. 1977 నుంచి జంటనగరాల్లో క్రీయాశీలక పాత్ర పోషించారు. 1986 -91 టర్ములో హిస్సాంగంజ్ మోండా డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ గా గెలిచారు.
2001లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరయ్యారు. కేసీఆర్ పిలుపుతో గులాబీ తీర్థం పుచ్చుకుని కారెక్కారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే గాకుండా టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 2002లో కారు గుర్తుపై పోటీచేసి మరోసారి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు కార్పొరేటర్ గా కొనసాగి.. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేశారు.
3సార్లు ఎమ్మెల్యే.. ఈసారి అత్యధిక మెజార్టీ
సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మారావు గౌడ్ అలియాస్ పజ్జన్న రాజకీయ జీవితంలో కూడా ఒడిదొడుకులు ఉన్నాయి. 2004లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008 ఉపఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. 2009లో సనత్ నగర్ నుంచి పోటీచేసిన పజ్జన్న.. మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2014లో మళ్లీ సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ క్రమంలో కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కొలువుదీరారు. తెలంగాణ తొలి ఎక్సైజ్ శాఖ, క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పద్మారావు గౌడ్.. 70 సార్లు అరెస్టయ్యారు. రైల్ రోకో, నిరసన కార్యక్రమాల సందర్భంగా పలు కేసులు నమోదయ్యాయి. 2018 డిసెంబరులో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి విజయం సాధించిన పజ్జన్న.. సికింద్రాబాద్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు బద్దలు కొట్టారు. తన సమీప ప్రత్యర్థిపై 45,491 ఓట్లు అధికంగా సాధించి విజయకేతనం ఎగురవేశారు.
శభాష్ పజ్జన్న.. కేసీఆర్ ప్రశంసల వర్షం
సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అత్యంత ఆప్యాయంగా పలకరించేవారిలో పజ్జన్న ఒకరు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన పజ్జన్నకు ఈసారి ప్రమోషన్ కింద డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పజ్జన్నపై ప్రశంసల వర్షం కురిపించారు కేసీఆర్. ఆయనతో తనకు 20 ఏళ్ల అవినాభావ సంబంధముందని గుర్తుచేసుకున్నారు. 2001లో టీఆర్ఎస్ లో చేరిన పద్మారావు గౌడ్.. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తొలి టీఆర్ఎస్ సభను రేయింబవళ్లు కష్టపడి విజయవంతం చేశారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా రెపరెపలాడించిన ఘనత ఆయన సొంతం.
గీత కార్మికులకు అండ
హైదరాబాద్లో కల్లు దుకాణాలు మూసివేయొద్దంటూ సమైక్య రాష్ట్రంలో పద్మారావు పోరాడిన తీరును సభ దృష్టికి తీసుకొచ్చారు కేసీఆర్. ఆనాడు సమైక్య పాలకులు వినకుండా లక్షమంది గీత కార్మికుల పొట్ట కొడితే.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక నగరంలో కల్లు దుకాణాల పునరుద్ధరణకు పద్మారావు విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా పెద్దసంఖ్యలో ఈత, తాటి చెట్లు నాటించడమే గాకుండా.. కల్లుగీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేయించిన ఘనత ఆయన సొంతమని వ్యాఖ్యానించారు.
పదవులతో, గెలుపోటములతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేరీతిన ఉండే పద్మారావు ప్రజాప్రతినిధిగా యువనేతలకు ఆదర్శమని కొనియాడారు కేసీఆర్. నిగర్విగా, నిరాండబరుడిగా, గొప్ప వ్యక్తిగా పేరున్న పద్మారావు.. ప్రజా జీవితంలో అనుసరించే విధానం స్ఫూర్తిదాయకమన్నారు. పజ్జన్న వ్యక్తిత్వ వికాసం చాలా గొప్పదని అభివర్ణించిన కేసీఆర్.. సభ పక్షాన ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మంచి నేతగా ప్రస్థానం సాగిస్తున్న పద్మారావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితం గడిపేలా భగవంతుడు ఆశీర్వదించాలని.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.