కేసీఆర్ మాములోడు కాదు.. 4 ఏళ్ల క్రితం ఏం చెప్పారు.. ఇప్పుడేం చేశారు: విజయశాంతి
సీఎం కేసీఆర్పై రాములమ్మ విజయశాంతి మరోసారి ఫైరయ్యారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ పర్యటన గురించి కామెంట్స్ చేశారు. కరోనా బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్ జిల్లాకు వచ్చారని, కానీ నాలుగేళ్ల క్రితం జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముఖం చాటేశారని అన్నారు. ఇప్పుడు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలో ప్రజలంతా ఇళ్లలో ఉన్నప్పుడు జిల్లాకు వెళ్లారని ఎద్దేశా చేశారు. ట్విటర్ వేదికగా కేసీఆర్పై ఆమె విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ వరంగల్లో కరోనా పరిస్థితులను పరిశీలించేందుకు జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ పర్యటనపై విజయశాంతి ఓ ట్వీట్ చేశారు. 'కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే.. అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని ఆశలు కల్పించారు. వరంగల్ని టెక్స్టైల్ హబ్ చేస్తానన్నారు. హైదరాబాదు నుంచి ఐటీ కంపెనీలు వరంగల్ వచ్చేలా చేస్తానన్నారు.
Recommended Video
చిన్నా చితకా హామీలు ఇంకెన్నో హామీలు ఇచ్చారు. చివరికి గతేడాది వరదల్లో ఈ హామీలన్నీ కొట్టుకుపోయాయి. మళ్ళీ అక్కడకు వెళితే ఎక్కడ జవాబు చెప్పుకోవాల్సి వస్తుందోనని భయపడుతూ వచ్చిన సీఎం తాను విధించిన ఈ కరోనా లాక్డౌన్ పెద్ద వరంలా మారింది. ప్రజలందరూ ఇళ్ళలోనే ఖైదీల్లా కాలం గడుపుతున్న సమయం చూసుకుని ఎంజీఎంని చుట్టేసి వచ్చారు. ప్రజల కంటబడితే ఎక్కడ నిలదీస్తారోనన్న ఆందోళనతో బిక్కు బిక్కుమంటూ బతికే పరిస్థితికి సీఎం దిగజారిపోయార'ని విమర్శించారు.