వీహెచ్ మధ్యవర్తిత్వం: జగ్గారెడ్డితో మీట్.. సర్దుకుపోవాలని చెప్పి..
తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వివాదంపై సీనియర్ నేతలు సర్దుబాటు చర్యలకు దిగారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో తన తీరు నచ్చకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా చేస్తానని ఇటీవల జరిగిన పీఏసీ సమావేశంలో జగ్గారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. పలు విషయాలపై పార్టీలోని ముఖ్య నాయకులతో విభేదిస్తున్నారు. జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు రంగంలోకి దిగారు.
హైదరాబాద్లోని జగ్గారెడ్డి నివాసానికి హనుమంతరావు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. సొంత నియోజకవర్గం సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ పెట్టించి.. విజయవంతం చేసిన జగ్గారెడ్డి లాంటి వారు కాంగ్రెస్ పార్టీకి అవసరం అని వీహెచ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. సమస్య ఏదైనా కలిసి పనిచేద్దామని జగ్గారెడ్డికి సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని వీహెచ్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యహారాల ఇంచార్జీ మాణికం ఠాకూర్ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలో తనకు వ్యక్తిగతంగా ఎదురవుతున్న సమస్యలను వీహెచ్ దృష్టికి తీసుకొచ్చారు. అధిష్టానంతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. వీహెచ్ హామీకి జగ్గారెడ్డి వింటారో లేదో చూడాలీ మరీ.
సీనియర్ నేత వీహెచ్ రాయబారంతోనైనా జగ్గారెడ్డి తీరు మారుతుందో చూడాలి మరీ. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్ చేయడంతో.. ఆయన టీఆర్ఎస్ కోవర్టు అనే ప్రచారం జరిగింది. కానీ దీనిని జగ్గారెడ్డి ఖండించారు. తనపై అనవసరంగా కామెంట్లు చేస్తున్నారని ఫైరయ్యారు. తను ఎవరీ కోవర్టు కాదని స్పష్టంచేశారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇంతలోనే వీహెచ్ పెద్దరికం తీసుకున్నారు. జగ్గారెడ్డికి సర్దిచెప్పారు. మరీ జగ్గారెడ్డి వింటారో లేదంటే.. తన ధిక్కార స్వరం కంటిన్యూ చేస్తారో చూడాలీ మరీ.