స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం - ఆరుగురు మృతి..!!
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వారే.
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. వారంతా ఐదో అంతస్తులోని కాల్ సెంటర్ సిబ్బంది. మృతులంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వారే. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి. మంటల్లో కాంప్లెక్స్ లోని పలు ఆఫీస్లు, షాప్లు దహనమయ్యాయి. ప్రమాద సమయంలో ఆఫీసుల్లోనే కొందరు ఉద్యోగులు ఉండటంతో ప్రాణనష్టం జరిగింది. మొత్తం 15 అగ్నిమాపక శకటాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఒక్కసారిగా అగ్ని జ్వాలలు..భయాందోళన
దక్కన్మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో అగ్ని ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది. సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్లో పలు బట్టల షాప్లు, గోడౌన్లు ఉన్నాయి.. వారిలో ఉన్న వారు తమను కాపాడాలంటూ అర్తనాదాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని రెస్య్కూ టీమ్ రక్షించగా, ఐదుగురు మృతి చెందారు. అగ్నిప్రమాదం కారణంగా చుట్టుముట్టిన పొగను పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్న ఆరుగురినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కాగా.. ఈ ఘటనలో 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిలో ప్రమాదం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
లోపలే చిక్కుకుపోయిన సిబ్బంది
అగ్ని ప్రమాద సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ సమయంలో 16 మంది వరకు లోపలో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది పలు అంతస్తుల్లో ఉన్న అద్దాలు పగులగొట్టారు. చుట్టుపక్కల నివాసాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. స్కై లెవల్ క్రేన్తో భవనంలో చిక్కుకున్న వారిని కిందకు దించారు. అయిదో అంతస్థులో ఓ కాల్ సెంటర్లో పనిచేసే ఆరుగురు పైనే ఉన్నారని తెలియడంతో ఓ బృందం సిబ్బంది కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అప్పటికే ఆ ఆరుగురిలో ఇద్దరు సురక్షితంగా ఉండగా.. మరో నలుగురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది కిందకు వచ్చే ప్రయత్నం చేసారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో మధ్యలో ఆగిపోయారని..అదే వారి ప్రాణాలో పోవటానికి కారణమైందని బయట పడిన వారు చెబుతున్నారు.
ఫైర్ నిబంధనలు అమలవుతున్నాయా
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ మెన్స్ వేర్ షాపులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. రోజూ వేలాది మంది బట్టలు కొనుగోలుకు వస్తుంటారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ కు మెన్స్ వేర్ కు ఫారెవర్ అనే ట్యాగ్ కూడా ఉంది. బ్రాండెడ్ తోపాటు అన్ బ్రాండెడ్ దుస్తులకు పెట్టింది పేరు ఈ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ లో దాదాపు 300 దుకాణాలు ఉంటాయి. కొన్ని బట్టల దుకాణాలు, మరికొన్ని పలు కంపెనీల ఆఫీసులు ఉన్నట్లు తెలుస్తోంది. కాంప్లెక్స్ 8 అంతస్తుల్లో ఉంటుంది. అయితే, ఇక్కడ ఫైర్ నిబంధనలు ఎంత వరకు అమలవుతున్నాయనేది సందేహంగా మారుతోంది. 1980లో భవనం నిర్మించారని తెలుస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications