హైదరాబాద్ లో అమానవీయ ఘటన; మంచాన పడిన తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిన తండ్రిని ఓ తనయుడు అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని కర్రతో, బెల్టుతో విచక్షణ రహితంగా కొడుకు కొట్టడంతో ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయారు.
జీడిమెట్లలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ లో 63 సంవత్సరాల సత్యనారాయణ అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితం అయ్యాడు. అయితే తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో, తండ్రితో కొడుకు సురేష్ గొడవకు దిగాడు. ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన సురేష్ ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
కర్రతో, బెల్టుతో సత్యనారాయణ పై దాడికి తెగబడిన సురేష్ కన్న తండ్రి అన్న విషయాన్ని మరిచి ఇష్టారాజ్యంగా కొట్టాడు. కొడుకు కొడుతున్న దెబ్బలకు తాళలేక తండ్రి హాహాకారాలు చేస్తున్నా వదిలిపెట్టకుండా సురేష్ అమానవీయంగా ప్రవర్తించాడు. కొట్టొద్దు అని తండ్రి ప్రాధేయపడినా వదలకుండా పైశాచికంగా ప్రవర్తించాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు తీవ్రగాయాల పాలైన తండ్రి సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇక ఈ విషయం స్థానికులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కొడుకును అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో ప్రేమతో, అల్లారు ముద్దుగా పెంచి, అన్ని విధాలా అండగా నిలిచే తండ్రి పట్ల కసాయి కొడుకు చేసిన దారుణం తరిగిపోతున్న మానవ సంబంధాలకు, అనుబంధాలకు అద్దం పడుతుంది. మంచాన పడిన తండ్రి అన్న కనీసం జాలితో కూడా చూడలేని సదరు కొడుకు తీరు స్థానికులకు విస్మయాన్ని కలిగించింది.