1070 గ్రాముల బంగారం సీజ్.. ఒకే ఫ్యామిలీ చేతివాటం... అవే వారి టార్గెట్
పొట్టకూటి కోసం భాగ్యనగరం వచ్చారు. కానీ సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. ఇంకేముంది దొంగతనం చేయడం ప్రారంభించారు. అదీ కూడా బంగారం షాపులనే లక్ష్యంగా చేసుకున్నారు. అలా చోరీ చేస్తూ.. చేస్తూ... చివరికీ పట్టుబట్టారు.
15 ఏళ్ల క్రితం సిటీకి..
ప్రకాశం జిల్లాకు చెందిన రేణుక ఆమె బంధువులు ఎం కిరణ్, వై రాజు, వారి భార్యలు తులసి, శ్వేత, మరో బంధువు రాణి 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. పొట్టకూటి కోసం వచ్చి హయత్ నగర్లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. కొన్నాళ్లు చిన్న చిన్న పనులు చేశారు. తర్వాత డబ్బుమీద ఆశతో .. దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నారు. ఐదుగురూ కలిసి కిరణ్ ఆటోలో నగరంలో తిరుగుతూ చోరీ చేసి పారిపోవటానికి అనువుగా ఉండే బంగారం షాపులను ఎంచుకునే వారు.
షాపులోకి వెళ్లి.. అలా లూటీ
వినియోగదారులుగా షాపులోకి వెళ్లి ఒకరు నగలు వస్తువులు చూపించమని అడుగుతారు. యాజమాని ఆ పనిలో ఉండగా అతడి దృష్టి మళ్లించి చేతికి అందిన బంగారం వెండి వస్తువులను చోరీ చేస్తారు. దాన్ని తమ వస్త్రాల లోపలి భాగాల్లో ప్రత్యేకంగా కుట్టించిన అరల్లో పెట్టుకుని షాపు నుంచి బయటకు వస్తారు. అంతా కలిసి అదే ఆటోలో ఉడాయిస్తారు.
అమ్మేసి.. వాటాలు పంచుకొని
కొన్నాళ్లకు చోరీ చేసిన సొత్తును అమ్మి వాటాలుగా పంచుకుంటారు. ఇదే తరహాలో చిక్కడపల్లిలోని రామ్స్వరూప్ జ్యువెలర్స్ నుంచి 600 గ్రాముల వెండి ఆభరణాలు, నాచారంలోని ఓంసాయి జ్యువెలర్స్ నుంచి 50 తులాల వెండి ఆభరణాలు, తుకారామ్గేట్లోని త్రిషాల్ జ్యువెలర్స్ నుంచి 400 గ్రాముల వెండి దొంగిలించారు. తుకారాం గేట్ లోని త్రిషాల్ జ్యువెలర్స్ కేసు విచారించేందుకు రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముఠాను గుర్తించారు.
1070 గ్రాముల బంగారం
ఆరుగురిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి ఆటోతోపాటు 1070 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై ఇప్పటికే పలు పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. ముఠాకు చెందిన రేణుకపై గతంలో వివిధ పోలీసుస్టేషన్లలో 13 కేసులు, కిరణ్పై 3, తులసీపై 8, శ్వేతపై 3, రాజుపై 2 కేసులు ఉన్నాయని తెలిపారు. కొన్ని పోలీసుస్టేషన్లలో వీరు వాంటెడ్గా ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులు ఆరుగురిని తుకారాం గేట్ పోలీసుస్టేషన్లో అప్పగించారు.