మైనర్ ఇష్టపడి కలిసినా అత్యాచారమే: 15 ఏళ్ల బాలిక కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక తీర్పును వెలువరించింది. మైనర్ ఇష్టపడి కలిసినా అత్యాచారమే అవుతుందని వ్యాఖ్యానించింది. 15 ఏళ్ల బాలిక కేసులో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. బంధువు చేసిన అఘాయిత్యం కారణంగా వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి హైకోర్టు అనుమతిచ్చింది. బాలికను ఆమె బంధువు ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి బలవంతంగా తన లైంగిక వాంఛను తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది.

మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు లైంగిక దాడి
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక 8వ తరగతి వరకు చదివింది. తల్లిదండ్రులతో కలిసి ఇక్కడే ఉంటోంది. కాగా, పెళ్లి ఇద్దరు పిల్లలున్న ఓ బంధువు(28) వ్యక్తిగత పనుల మీద నవంబర్ నెలలో వీరి ఇంటికి వచ్చాడు. బాలిక తల్లిని అక్కగా పిలిచే అతడు.. కొద్ది రోజులపాటు ఇక్కడే ఉన్నాడు. బాలిక తల్లిదండ్రులు రోజువారీ పనికి బయటికి వెళ్లగా.. బాలికను బెదిరించి బయటకు తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక, తల్లిదండ్రులకు విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు.

మైనర్ బాలిక అవాంఛిత గర్భం దాల్చడంతో..
అయితే, కొద్ది రోజుల తర్వాత అతడు ఖమ్మం వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే బాలిక ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో ఆమె తల్లి ఆందోళన చెందింది.

హైకోర్టును ఆశ్రయించిన బాలిక తల్లి
అవాంఛిత గర్భాన్ని తొలగించాలని బాలిక కుటుంబసభ్యులు నిలోఫర్ ఆస్పత్రికి వెళ్లగా.. అందుకు వైద్యులు నిరాకరించారు. చట్టప్రకారం అనుమతులు అవసరం అని వైద్యులు చెప్పడంతో బాలిక తరపున ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది. 15 ఏళ్ల బాలిక గర్భాన్ని కొనసాగించడం వల్ల మానసిక, శరీరక ఇబ్బందులకు గురవుతుందన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

మైనర్ బాలిక ఇష్టపూర్వకంగానే కలిసినా.. అది అత్యాచారమే: హైకోర్టు
మైనర్ బాలిక ఇష్టపూర్వకంగానే తన బంధువుతో వెళ్లినా.. లైంగికంగా కలిసినా. అత్యాచారం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. గర్భం కారణంగా మైనర్ అయిన బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని, శారీరకంగా, మానసికంగా ప్రభావం ఉంటుందని కోర్టు వెల్లడించింది. అత్యాచారం వల్ల వచ్చిన అవాంఛిత గర్బాన్ని తొలగించుకోవచ్చని తెలిపింది. అయితే, దీనికి ముందు బాలికతో మాట్లాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 20 వారాల గర్భంతో కోర్టుకు రావడం ఇబ్బందికరమని.., నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కు తమ అభిప్రాయం చెప్పాలని సూచించింది. బాలికతో, ఆమె తల్లితో సూపరింటెండెంట్ విడివిడిగా మాట్లాలని కోర్టు ఆదేశించింది. అబార్షన్ వల్ల ఎదురయ్యే అన్ని పరిణామాలను వివరించాలని, ఇద్దరూ అంగీకరిస్తే జాప్యం లేకుండా గర్భవిచ్ఛిత్తి చేయాలని నిలోఫర్ ఆస్పత్రి వైద్యులను హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications