గర్భిణి మరణంపై హైకోర్టు ఆగ్రహం: కరోనా పరీక్షలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల కట్టడికి కీలక ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఎందుకు నిర్వహించడం లేదని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ సోమవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. మే 1 నుంచి 14 వరకు సరసరా 69,185 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశ సరారితో పోలిస్తే కరోనా పరీక్షల్లో వెనుకబడిలేమిన వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస రావు తెలిపారు.
Recommended Video

కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించినా..
ప్రతి రోజూ కనీసం లక్ష పరీక్షలు జరపాలని అనేకసార్లు ఆదేశించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లోలా తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ట ధరలు గతంలోనే ఖరారు చేశామని డీహెచ్ శ్రీనివాసరావు తెలుపగా.. చికిత్స విధానాలు మారినందున సమీక్షించి తాజా జీవో ఇవ్వాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫిర్యాదుల పరిష్కారానికి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరలు నిర్ణయించండి..
ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలపై వెబ్సైట్లలోని వివరాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని హైకోర్టు తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రుల అక్రమాలపై ముగ్గురు సభ్యుల కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆస్పత్రుల్లో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్న అంశంపై హైకోర్టు ఆరా తీసింది. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోతే ఎలా? అని ప్రశ్నించింది. వారికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

పకడ్బందీగా లాక్డౌన్ అమలంటూ డీజీపీ నివేదిక
ఇది ఇలావుండగా, కరోనా నిబంధనల అమలుపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కరోనా ఔషధాల బ్లాక్ మార్కెట్పై 98 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాల ఏర్పాటుతోపాటు లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకున్నట్లు డీజీపీ వివరించారు. మే 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో వెల్లడించారు. మాస్కులు ధరించనందుకు 339412 కేసులు నమోదు చేయడంతోపాటు రూ. 31 కోట్ల జరిమానా విధించినట్లు, భౌతిక దూరంపాటించనందుకు 22,560 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

లాక్డౌన్, కర్ఫ్యూపై హైకోర్టు సంతృప్తి.. సీపీలకు అభినందనలు
కాగా, లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు హాజరయ్యారు. లాక్డౌన్ వీడియోగ్రఫీని ముగ్గురు కమిషనర్లు కోర్టుకు సమర్పించారు. జైళ్ల శాఖలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ పూర్తిపై కోర్టుకు నివేదిక అందజేశారు. కాగా, వీరి పనితీరు అభినందనీయమని.. అదేవిధంగా పనిచేయాలని హైకోర్టు సూచించింది. కేంద్రం నుంచి 650 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, 10వేల రెమిడిసివిర్ ఇంజెక్షన్లు వస్తున్నాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.

గర్భిణీ మరణంపై హైకోర్టు ఆగ్రహం.. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఆదేశం
మరోవైపు, మల్లాపూర్లో గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గర్భిణీ మృతి ఘటనపై విచారణ చేసి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సదరు గర్భిణీకి సరైన సమయంలో వైద్యం అందించేందుకు ఆస్పత్రులు నిరాకరించడంతో ఆమె చివరకు ప్రాణాలు కోల్పోయింది. ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్లు ఏర్పాటు చేసి లాక్డౌన్లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమ్యూనిటీ కిచన్ల వివరాలను ప్రతి జిల్లా వెబ్ సైట్లలో పొందుపర్చాలని తెలిపింది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఈఎన్టీ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కమ్యూనిటీ సెంటర్లను టెస్టింగ్, ఐసోలేషన్ సెంటర్లుగా పరిగణించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది హైకోర్టు.












Click it and Unblock the Notifications