తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగాయ్: హోలీ పండగ వేళ..!
హైదరాబాద్: హోలీ పండగ వేళ.. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. బస్ ఛార్జీలను పెంచింది. ఇవ్వాళ్టి నుంచే పెరిగిన బస్ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. రౌండప్ విధానంలో బస్ ఛార్జీలను పెంచింది. చిల్లర సమస్యను పరిష్కరించడానికి ఈ విధానం కింద ఛార్జీలను సవరించాల్సి వచ్చిందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. దీనితోపాటు టోల్ప్లాజాల వద్ద చెల్లించే మొత్తంలో ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఛార్జీని కూడా స్వల్పంగా పెంచింది.
పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో చిల్లర సమస్యను తెర దించడానికి రౌండప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా- ఆర్టీసీ యాజమాన్యం 12 రూపాయలుగా ఉన్న టికెట్ ధరను 10 రూపాయలకు తగ్గించింది. 13 రూపాయలు,14 రూపాయలు ఉన్న ధరను 15 రూపాయలుగా నిర్ధారించింది. 80 కిలోమీటర్ల దూరానికి ఇప్పటిదాకా 67 రూపాయలను వసూలు చేయగా.. తాజా సవరణతో అది 65 రూపాయలకు తగ్గింది.
టోల్ ప్లాజాల వద్ద ఆర్డినరీ బస్ సర్వీసుపై ఒక రూపాయి, హైటెక్, ఏసీ బస్సులపై రెండు రూపాయలను అదనంగా వసూలు చేస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. చిల్లర సమస్యకు చెక్ పెట్టడానికే టికెట్ల రేట్లను స్వల్పంగా సవరించాల్సి వచ్చిందని, ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. పెరిగిన డీజిల్ ధరలు, బస్సుల నిర్వహణ వ్యయం, విడి పరికరాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆర్టీసీపై సంవత్సరానికి 4,260 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది.
ఆర్టీసీకి వస్తోన్న నష్టాల్లో అధిక వాటా డీజిల్దే. ఇదివరకు లీటర్ ఒక్కింటికి 70 రూపాయల వరకు ఉన్న డీజిల్ ధర- ప్రస్తుతం 90 రూపాయలను దాటేసింది. నష్టాన్ని కొంతమేరకైనా పూడ్చుకోవాలనే ఉద్దేశంతో ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. కిందటి సంవత్సరం డిసెంబర్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఇదిలావుండగా.. దేశవ్యాప్తంగా ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొననున్నారు.