హైదరాబాద్ లో రోడ్డుపై ఆందోళన.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
హైదరాబాద్ : హైదరాబాద్ కొత్తపేట చౌరస్తాలో కొందరు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్ ను అధికారులు మూసివేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో ఆందోళనకారులు రోడ్డుమీదకు రావడంతో ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది.
విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్ లో ప్రతి నిత్యం వ్యాయామం చేయడానికి చాలామంది వస్తుంటారు. ఈక్రమంలో అధికారులు గ్రౌండ్ ను మూసివేయడం వారి ఆగ్రహానికి కారణమైంది. దీంతో కొత్తపేట చౌరస్తాలో వందలాది మంది ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి వ్యాయామాలు చేస్తూ నిరసన తెలిపారు.
వీరికి ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. విక్టోరియా గ్రౌండ్ ను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వీరి ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు.