ఆ మంత్రి, ఎమ్మెల్యేల సంగతి ఏంటీ.. కేసీఆర్పై రాములమ్మ గుస్సా
సీఎం కేసీఆర్పై ఫైర్ బ్రాండ్ విజయశాంతి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పక్కదారి పట్టిందని విమర్శించారు. మంత్రులే స్వయంగా భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్న ఆడియోలు బయటకు వస్తున్నాయన్నాని తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు. ఆ 'నలుగురు' ఎమ్మెల్యేలు డ్రగ్స్ పార్టీలకు సంబంధించి తీవ్ర ఆరోపణలపై కూడా కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో పరిపాలన గొప్పగా ఉందనే సీఎం తప్పచేసిన వారిపై చర్యలు తీసుకునే దమ్ముందా అని ప్రశ్నించారు. ఆ మంత్రిని తొలగించగలరా అని సవాల్ విసిరారు. కనీసం ఆ ఎమ్మెల్యేలపై పార్టీ పరంగానైనా చర్యలు తీసుకోగలరా అని విజయశాంతి నిలదీశారు. ఓవైపు అవినీతి, అనైతిక వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతుంటే మరోవైపు, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఉద్యోగాలు రాని యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 7,600 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని కేంద్రం చెబితే నాలుగైదు వేలు కూడా దాటడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు చేసే మిషన్లు లేక ప్రైవేటుకు పంపిస్తున్నారని ఆరోపించారు. కరోనా కట్టడికి మద్యం దుకాణాలు, బార్లు, పబ్లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు తక్కువగా చేస్తున్నారని హైకోర్టు మందలించినా సర్కారు మారడం లేదన్నారు.