వదలని వాన: తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఇప్పుడే ఆగేలా లేవు. రానున్న మూడు రోజులపాటు రాజధాని నగరంతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఎల్లుండి అంటే శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని తెలిపారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉందని వాతావరణ సంచాలకులు నాగరత్న తెలిపారు. బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. గురువారం బలహీన పడిందని వివరించారు.
కాగా, మంగళ, బుధవారం వారాల్లో వర్షాలు కాస్త తెరిపినివ్వడంతో జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. ఉస్మాన్ సాగర్ లోకి 3వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, హిమాయత్ సాగర్ కు 400 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుం 1787 అడుగులకు చేరింది. దీంతో అధికారులు పది గేట్ల ద్వారా మూసీలోకి 6వేల 90 క్యుసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఇక, హిమాయత్ సాగర్ కి ఇన్ ఫ్లో భారీగా తగ్గుతున్నట్టు అధికారులు ప్రకటించారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా... ఇప్పటికే 1760 అడుగులకు చేరింది. దీంతో హిమాయత్ సాగర్ ఒకగేట్ ద్వారా మూసీలోకి 330 క్యూసెక్కుల నీటిని వదలుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో మూసీ వరదలో చిక్కుకున్న పరివాహక ప్రజల ఇళ్ల నుంచి వరద నీరు తగ్గుతోంది. గత రెండ్రోజులుగా ఇళ్లకు దూరంగా ఉన్న ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. వరదనీరు ఇళ్లల్లోకి చేరడంతో ఇంట్లోని సామాగ్రి నీటిలో మునిగిపోయి పనికిరాకుండా మారాయని బాధిత ప్రజలు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications