షర్మిల సంకల్ప సభ రూట్ మ్యాప్ ఇదే: దారి పొడవునా రిసీవింగ్ పాయింట్లు: ప్రసంగం ఎప్పుడంటే?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైెఎస్ షర్మిల.. సమయాత్తమౌతున్నారు. ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన సంకల్ప సభ గడువు సమీపిస్తోన్న కొద్దీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే సంకల్ప సభ రథాన్ని ఆమె ప్రారంభించారు. తాజాగా- రూట్ మ్యాప్ను విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి సుమారు 190 కిలోమీటర్ల దూరం ఉన్న ఖమ్మం నగరానికి ఆమె ఏఏ మార్గాల మీదుగా బయలుదేరి వెళ్తారనే విషయాన్ని షర్మిల పార్టీ నాయకులు కొద్దిసేపటి కిందటే వెల్లడించారు.

ఎనిమిది చోట్ల రిసీవింగ్ పాయింట్లు..
హయత్ నగర్, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట్, నాయకన్గూడెం మీదుగా వైఎస్ షర్మిల సంకల్ప యాత్ర సాగుతుంది. షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆమె బంజారాహిల్స్లోని లోటస్ పాండ్ నుంచి బయలుదేరుతారు. లక్డీకాపూల్, కోఠి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మీదుగా హయత్ నగర్ చేరుకుంటారు. హయత్ నగర్లో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట్ మీదుగా 1:15 నిమిషాలకు ఆమె చివ్వెంలకు చేరుకుంటారు. ఆయా ప్రాంతాలన్నింటి చోట రిసీవింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన వేదికల మీద నిల్చుని వైఎస్సార్ అభిమానులు ఆమెకు స్వాగతం పలుకుతారు.

సాయంత్రం 5:15 ఖమ్మం మీటింగ్ పాయింట్కు
చివ్వెంలలో మధ్యాహ్న భోజనం అక్కడే పూర్తిచేస్తారు. అనంతరం మోతె మండలం నామవరం, నాయకన్ గూడెం మీదుగా ఖమ్మం చేరుకుంటారు. సాయంత్రం 5:15 నిమిషాలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆమె సంకల్ప సభకు బయలుదేరి వెళ్లడానికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని వినియోగిస్తారు. దీన్ని సోమవారమే ఆమె ప్రారంభించారు. ఈ సభ నిర్వహణకు ఖమ్మం జిల్లా పోలీసులు ఇదివరకే అనుమతి ఇచ్చారు. కోవిడ్ ప్రొటోకాల్ను పాటిస్తూ అయిదు నుంచి ఆరు వేల మంది లోపే సభను నిర్వహించాలంటూ సూచించారు.

పార్టీ పేరు, జెండా.. అజెండా అక్కడే..
ఖమ్మం సభలోనే పార్టీ పేరు, విధి విధానాలు, మార్గదర్శకాలను వైఎస్ షర్మిల ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ విధి విధానాలను రూపొందించడంపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ అభిమానులతో జిల్లాలవారీగా నిర్వహించిన ఆత్మీయ సమావేశాల సందర్భంగా వారి నుంచి అందిన సూచనలు, సలహాలను ఆధారంగా చేసుకుని విధి విధానాలను రూపొందించినట్లు ప్రచారం సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసే విషయాన్ని కూడా సంకల్ప సభ వేదిక మీది నుంచే షర్మిల అధికారికంగా ప్రకటిస్తారు.

కొనసాగుతోన్న చేరికలు..
సంకల్ప సభ గడువు సమీపిస్తోన్న కొద్దీ వైఎస్ షర్మిల పార్టీలోకి చేరుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్..షర్మిల పార్టీలో చేరారు. సోమవారం ఆమె లోటస్పాండ్లో షర్మిలను కలిశారు. కరీంనగర్, నారాయణ్పేట్ జిల్లాలకు చెందిన పలువురు వేర్వేరు పార్టీల నాయకులు షర్మిలకు మద్దతు ప్రకటించారు. ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్కు చెందిన సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ షర్మిల పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఖమ్మం సభ అనంతరం మరిన్ని చేరికలు ఉండొచ్చనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications